అమెరికన్లకు హెచ్చరిక!: తొలిసారి హిల్లరీని వెనక్కినెట్టిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై పైచేయి సాధించేందుకు తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. హిల్లరీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆమెపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ అమెరికన్లను ఆకట్టుకునేలా తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
ట్రంప్ న్యూమెక్సికోలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మాట్లాడారు. హిల్లరీ పాలసీలను దుయ్యబట్టిన ట్రంప్.. హిల్లరీ పాలసీలతో అమెరికాలోకి లక్షలాది వలసదారులు వచ్చి చేరతారని ట్రంప్ హెచ్చరించారు. అంతేగాక, వారం రోజుల్లో హిల్లరీ 650 మిలియన్ల మంది వలసదారులు అమెరికాకు వచ్చేలా చేస్తారని.. ఇలా అయితే కేవలం 12 వారాల్లోనే అమెరికా జనాభా ప్రపంచ జనాభా కంటే పెరిగిపోతుందని హెచ్చరించారు.
'భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకోండి. వారంలో దేశ జనాభా మూడు రెట్లు పెరుగుతుంది. ఒక్కసారి దేశ సరిహద్దులపై నియంత్రణ కోల్పోతే.. ఇక దేశమే ఉండదు' అని ట్రంప్ అమెరికన్లను హెచ్చరించారు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం అమెరికా జనాభా 2016లో 324 మిలియన్లుగా ఉందని ట్రంప్ తెలిపారు. హిల్లరీ విధానాలు అనుసరిస్తే వారం రోజుల్లో 650 మిలియన్ల మంది పెరుగుతారని ఆరోపించారు. 2016 అధ్యయనం ప్రకారం అమెరికాలో అక్రమ వలసదారులు 11 మిలియన్ల దాకా ఉన్నారని ట్రంప్ వివరించారు.
గతంలో ట్రంప్ మెక్సికో నుంచి అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడ కడతానని, ముస్లింలపై నిషేధం విధించాలని పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నవంబరు 8న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ, ట్రంప్లు పోటాపోటీగా తలపతున్నారు.
హిల్లరీపై ట్రంప్ పైచేయి
కాగా, అమెరికా అధ్యక్ష రేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంటోంది. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు షాక్ తగిలింది. తొలిసారిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆమెను వెనక్కినెట్టారు. ఏబీసీ న్యూస్/వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో ఆయన ఒక శాతం ఆధిక్యం కనబరిచారు. దీనిలో 46 శాతం మంది ఆయనకు మద్దతు పలికారు.
'సర్వేలు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ హిల్లరీ ఏడు శాతం మద్దతుదారులను కోల్పోయారు. ముఖ్యంగా శుక్రవారం, ఆదివారం మధ్య ఈ ప్రభావం బాగా కనిపించింది. ప్రైవేటు ఈ-మెయిల్ వివాదమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ట్రంప్ మద్దతుదారులు మాత్రం అక్టోబరు 20 నుంచీ ఇప్పటివరకూ స్థిరంగానే ఉన్నారు'అని ఏబీసీ న్యూస్/వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
గత ఎన్నికల్లో ఇదే సమయానికి రెండు పార్టీల అభ్యర్థులకున్న మద్దతుదారులతో పోలిస్తే.. ప్రస్తుతం హిల్లరీ, ట్రంప్ ఇద్దరు వెనకబడినట్టే కనిపిస్తుందని వివరించింది. తాజా విజయంపై ట్రంప్ రెట్టించిన ఉత్సాహంతో స్పందించారు. 'వావ్, ప్రస్తుతం నేను ఆధిక్యంలో ఉన్నా. రెండు వారాల్లో దాదాపు 12 పాయింట్లు పైకి వెళ్లాను. అది కూడా సంకుచిత హిల్లరీని వెనక్కు నెట్టి'అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, మూడి సంస్థ విశ్లేషకులు మాత్రం హిల్లరీనే గెలుస్తారని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఇప్పటివరకూ ప్రముఖ సంస్థలు వెలువరించిన అంచనాల సగటు చూస్తే.. హిల్లరీ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్పై ఆమె 3.1 శాతం పాయింట్లు ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. రియల్ క్లియర్ పాలిటిక్స్ (ఆర్సీపీ) ఈ ఫలితాలను విడుదల చేసింది. ఇప్పటివరకూ ప్రముఖ సంస్థలు వెలువరించిన ఫలితాలను ఆర్సీపీ పరిగణలోకి తీసుకుంది.