శుభవార్త: మంచి మార్కులతో విద్యార్థులకు రుణాలు ఇక సులభం
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలు తీసుకోవాలంటే చిన్న విషయం కాదు. బ్యాంకు సిబ్బంది అడిగిన అన్ని రకాల పత్రాలను సమర్పిస్తేనే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. అయితే విద్యార్థులు తమ ఉన్నత చదువుల కోసం బ్యాంకులు రుణాలను మంజూరు చేసేందుకు సవాలక్ష ప్రశ్నలను అడుగుతాయి. అయితే విద్యార్థుల మార్కుల ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి.
విద్యార్థులు తమ చిన్న చిన్న అవసరాలను తీర్చుకొనేందుకుగాను వారి మార్కులన కొలమానంగా తీసుకొంటున్నాయి కొన్ని సంస్థలు. ఈ మార్కులను ఆధారంగా చేసుకొని విద్యార్థులకు బ్యాంకు రుణాలను అందిస్తున్నాయి.
ఎక్కువ శాతం మార్కులు వస్తే ఎక్కువ మొత్తంలో రుణాలు పొందేందుకు విద్యార్థులు అర్హత సాధిస్తారు.కానీ, అదే సమయంలో తక్కువ మార్కులు పొందితే కొన్ని సమయాల్లో రుణాలు కూడ దక్కకపోయే అవకాశం కూడ లేకపోలేదు.
మార్కుల ఆధారంగా రుణాలు
మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులకు స్టూడెంట్ లోన్లు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యార్థులు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు చిన్నపాటి మొత్తాల్లో రుణాలు అందించేందుకు ఆయా వ్యక్తులు, సంస్థలు వారి మార్క్ షీట్లను విశ్లేషిస్తున్నాయి.ఈ మార్కుల ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి.క్రేజీబీ అనే సంస్థ ఈ మేరకు విద్యార్థులకు రుణాలను మంజూరు చేస్తోంది.
ఐఫోన్, ల్యాప్టాప్ల కోసం రుణాలు
ఐఫోన్, ల్యాప్టాప్ల కొనుగోలు కోసమే విద్యార్థులు ఎక్కువ రుణాలను కోరుకొంటున్నట్టుగా క్రేజీబీ సీఈవో మధుసూధన్ చెప్పారు.ఆయా విద్యా సంస్థల ప్రతిష్ట, ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల వ్యక్తిగత సామర్ధ్యాన్ని కూడా రుణాలు ఇచ్చే సందర్భంలో రుణ దాతలు పరిశీలిస్తున్నారు.
ఆన్లైన్లో మార్కుల వివరాలు
బెంగళూర్కు చెందిన విశ్వేశరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ తమ విద్యార్థుల మార్కుల వివరాలను ఆన్లైన్లో ఉంచింది. ఆ వివరాలను ఆయా సంస్థలు పరిశీలించి రుణాలను అందచేస్తుండటంతో ప్రతిష్టాత్మక సంస్ధల్లో చదివే విద్యార్ధులకు సులభంగా రుణ వితరణ జరుగుతోంది.
వాయిదాల పద్దతిలో చెల్లింపు
.విద్యార్ధులు తీసుకున్న రుణాలను సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి ఆయా సంస్థలు.ఈ తరహ విధానం అమల్లోకి రావడంతో ఇతర సంస్థల విద్యార్థులు కూడ తమ మార్కుల జాబితా ఆధారంగా రుణాలు కావాలని కోరుతున్నారు. అంతేకాదు తమ మార్కుల వివరాలను కూడ ఆన్లైన్లో పెట్టాలని ఆయా విద్యాసంస్థలను కోరుతున్నారు.