కేసీఆర్ థర్డ్ ఫ్రంట్లోకి పవన్ కల్యాణ్: ఏమన్నారు?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తలపెట్టిన థర్డ్ ఫ్రంట్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్కు ఆయన పది మార్కులకు ఆరు మార్కులు వేసిన విషయం తెలిసిందే.
అయితే, ఇంకా థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచించలేదని పవన్ కల్యాణ్ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే, కేసిఆర్ తలపెట్టిన థర్డ్ ఫ్రంట్పై ఆయన ఎటూ కాకుండా స్పందించారు.
కేసీఆర్ వద్ద చర్చకు వచ్చింది...
కేసిఆర్ను ఆ మధ్యలో కలిసినప్పుడు థర్డ్ ఫ్రంట్ ప్రస్తావనకు వచ్చిందని, అయితే దానిపై పూర్తిగా ఇప్పటి వరకు కూడా చర్చించలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రాల సమస్యలను బిజెపి, కాంగ్రెసులు సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్లే థర్డ్ ఫ్రంట్ ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.
పొత్తుల గురించి ఆలోచించలేదు..
పొత్తుల గురించి ఇప్పటి వరకు ఏ విధమైన ఆలోచన చేయలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. ఒంటరిగా వెళ్లాలా, ఎవరితోనైనా కలిసి నడవాలా అనే విషయాన్ని ఎన్నికల సమయంలో తేల్చుకుంటానని ఆయన చెప్పారు.
అప్పట్లో కేసిఆర్తో భేటీ...
పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా విడుదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ను కలిశారు. అదో సంచలనంగా మారింది. కేసిఆర్ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. కోత లేకుండా విద్యుత్తు సరఫరా చేయడాన్ని, రైతులకు రుణమాఫీ చేయడాన్ని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఇతర పథకాలను కూడా ఆయన కొనియాడారు.
మమతతో కేసిఆర్ భేటీ...
కాగా, కేసిఆర్ సోమవారంనాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీని కలిశారు. బిజెపికి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసే విషయంపై ఆయన చర్చించారు. వైసిపి, టిడిపి ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంపై మమతతో భేటీ తర్వాత కేసిఆర్ నిర్ణయం తీసుకుంటారనే మాట వినిపిస్తోంంది.