తెలంగాణ శాఖపై వెనక్కి తగ్గిన తెలుగుదేశం తమ్ముళ్లు?
నాగం ఇంటిలో భేటీ అయిన శాసనసభ్యులందరినీ చంద్రబాబు ఫోన్ చేసి పిలిచారు. కానీ నాగం, ఎర్రబెల్లి, కడియంలను మాత్రం పిలవలేదు. ఇలాంటి వారు పార్టీలో నుండి బయటకు వెళ్లినా ఫరవాలేదు అన్నట్టు చంద్రబాబు వ్యవహరించారు. అయితే తెలంగాణ టిడిపి నేతలు బాబుకు నచ్చజెప్పడంతో ఆయన కాస్త చల్లబడి వారిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక శాఖ అవసరం లేదని, సమన్వయ కమిటీ ఏర్పాటు మాత్రం చేసుకోవచ్చని ఆయన సూచించారు. దానికి వారు ఒప్పుకోక పోవడంతో మూడురోజులు తనకు పర్యటన ఉందని, పర్యటన నుండి వచ్చిన అనంతరం మాట్లాడుదామని చెప్పి వెళ్లారు.
అయితే ఆ తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు అందరూ కలిసి రహస్యంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ శాఖ పేరుతో, రాజీనామాల బెదిరింపులతో బాబుకు కొత్తగా తలనొప్పులు తీసుకు రావద్దని సీమాంధ్ర నేతలు తెలంగాణ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. బాబు చెప్పిన కో ఆర్డినేషన్కే మొగ్గు చూపాలని వారు కోరినట్టు తెలుస్తోంది. వారు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు వచ్చాక జరిగే భేటీ హాట్హాట్గా కాకుండా కూల్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.