జమ్మూ విమానాశ్రయంలో బిజెపి నేతలను అడ్డుకున్న పోలీసులు
తమను శ్రీనగర్ ప్రభుత్వం అడ్డుకోవడంపై సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. జమ్మూ-కాశ్మీర్ దేశంలో అంతర్భాగమని చెప్పడానికే బిజెపి ఏక్తా తిరంగ యాత్రను నిర్వహిస్తోందని చెప్పారు. భారతదేశంలోనే ఉన్న ప్రాంతంలో దేశభక్తితో జెండాను ఎగురవేయడానికి ప్రభుత్వం అడ్డుపడటాన్ని చూస్తే వారి దేశభక్తి అర్ధమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్సింగ్, జమ్మూ-కాశ్మీర్లో ఉన్న ఓమర్ అబ్దుల్లా ప్రభుత్వం వేర్పాటువాదులకు లొంగి పోతున్నారని ఆరోపించారు. ఏక్తా తిరంగా యాత్రపై వారు అనవసరంగా ప్రజలలో భయాందోళన కలుగజేస్తున్నారన్నారు.
భారతదేశంలోని అంతర్భాగంలో జాతీయ జెండా ఎగురవేయడానికి అనుమతి ఇవ్వకపోవడం దేశభక్తి ఎలా అనిపించుకుంటుందని ప్రశ్నించారు. కాగా బిజెపి నేతలు ఉన్న ఎయిర్ పోర్టు పరిధిలో 144వ సెక్షన్ విధించారు. తమ పార్టీ నేతలను అడ్డుకోవడాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం కూడా కర్ణాటక నుండి తిరంగా యాత్రకు కాశ్మీర్ బయలుదేరిన 2000మంది కార్యకర్తలను నిద్రలో ఉన్న సమయంలో వెనక్కి పంపించిన విషయం తెలిసిందే.