వైయస్ జగన్ క్యాంప్ శాననసభ్యులకు షాక్కు అధిష్టానం రెడీ
ప్రజారాజ్యం, మజ్లీస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వానికి ఢోకా ఉండదనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ జగన్ వర్గంలో బాగా దూకుడుగా ఉన్న వారిపై పార్టీపరంగా చర్యల కంటే, అనర్హత వేటు వేసేలా ప్రయత్నించాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధ్యక్షురాలిపైనే విరుచుకుపడుతూ ప్రభుత్వాలను తూర్పారపడుతున్నా ఇప్పటిదాకా ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేకు, ఎంపీకి, ఎమ్మెల్సీకి కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ చేతకానితనంగా జగన్ శిబిరం భావిస్తూ వస్తోంది. ఈ పరిస్థితిని గమనించి మరికొందరు ఎమ్మెల్యేలకు జగన్ వర్గం గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు అధిష్ఠానం, ఇటు ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్లు రంగంలోకి దిగారు. జగన్ వర్గాన్ని నిలువరించేందుకు అన్ని రకాల ఎత్తుగడలకు దిగుతున్నారు. పలు ఆకర్షణలతో జగన్ వెంట వెళ్తున్న ఎమ్మెల్యేల్లో కొందరికి వాస్తవ పరిస్థితి వివరించి, తిరిగి పార్టీవైపు తిప్పుకునేందుకు కిరణ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో జగన్ వెంట వెళ్ళిన ఇద్దరు ఎమ్మెల్యేలు షాజహాన్, రవిలు ఆదివారం కిరణ్ ఆ జిల్లాలో నిర్వహించిన రచ్చబండలో పాలుపంచుకున్నారు. జగన్ దీక్షలో పాల్గొన్న ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు కాంతారావు, కుంజా సత్యవతిలు జిల్లా మంత్రి వెంకటరెడ్డితో వచ్చి సీఎంతో భేటీ అయి వెళ్ళారు. అదేవిధంగా జగన్ మద్దతుదారునిగా భావించే కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి నియోజకవర్గంలోనే సీఎం రచ్చబండ నిర్వహించారు. ఇక కడప తరవాత అత్యధికంగా జగన్కు తొలుత మద్దతు తెలిపిన పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యేల్లో ముగ్గురు కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ కొందరు ఎమ్మెల్యేలు ఇదే పద్ధతి పాటిస్తున్నారు.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓటేసిన తెరాస శాసనసభ్యులపై వేటు వేసిన విధంగానే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని అనర్హునిగా ప్రకటించాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. అదే తరహాలో జగన్ వర్గంగా వ్యవహిరిస్తున్న ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేయాలనే కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలిగా నలుగురైదుగురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేస్తారని చెబుతున్నారు. దీంతో మిగిలిన ఆ వర్గ ఎమ్మెల్యేలు భయపడి కొంత దూరంగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అప్పటికీ లెక్కలేకుండా వ్యవహరిస్తే అటువంటి వారందరిపై ఇదే విధంగా స్పీకర్కు ఫిర్యాదు చేస్తారని అంటున్నారు. ఈ పరిస్థితి వచ్చినా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా ఉండకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ముందుగా ప్రజారాజ్యం, మజ్లిస్ పార్టీల మద్దతు పొందింది.