త్వరలో కేంద్రం తెలంగాణ ప్రకటిస్తుంది: వి హనుమంతరావు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని, ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మారారని గుర్తు చేశారు. సిపిఐ నేత నారాయణలో కూడా మార్పు వస్తుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతుందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు. హోంమంత్రి చిదంబరం రెండో సమావేశం ఇవ్వాలో రేపో ఉంటుందన్నారు. ఒక్కో పార్టీనుండి ఒక్కరు అని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని, ఆ విషయంలో కేంద్రం యోచిస్తుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటే కేంద్రంలో బలం మరింతగా ఉంటుందన్నారు. అభివృద్ధి కూడా బావుంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం కేవలం ప్రత్యేక తెలంగాణ లక్ష్య సాధన కోసమే పుట్టింది కాబట్టి వారు ఏమైనా చేయవచ్చని, అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ అని తెలంగాణలో పార్టీని నిలుపుకుంటూ ప్రజల అభీష్టం మేరకు వెళ్లవలసి ఉంటుందన్నారు. ఆయన అవిశ్వాసమే కాదు, ఆయన ఎజెండా కోసం ఏమైనా చేయవచ్చన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఆషామాషీగా రాలేదన్నారు. కిందిస్థాయినుండి ఒత్తిడులు వచ్చినందువల్లే వారు తెలంగాణపై డిమాండ్ చేస్తూ ఢిల్లీ వచ్చారన్నారు.