యువతను నిర్లక్ష్యం చేస్తే ఈజిప్టు తరహా ఉద్యమం: కొండా సురేఖ
ప్రభుత్వం ఈ రోజు యువతతో పెట్టుకుందని, ఏ దేశమైనా యువతతో పెట్టుకుంటే బ్రతికి బట్టకట్టదన్నారు. ప్రయివేటు కళాశాలలు ఎప్పుడైనా ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవ్వమని అడిగారా అని కాని ఇప్పుడు అడుగుతున్నారన్నారు. పేద విద్యార్థులకు కూడా మంచి విద్యను అందించడానికే వైఎస్ ఫీజు రీయింబర్స్మెంట్స్ ప్రవేశ పెట్టారన్నారు. వైఎస్ చనిపోయాక ఫీజు రీయింబర్స్మెంట్స్ను ప్రభుత్వం ఇవ్వడం మానివేసిందన్నారు. ప్రభుత్వం చర్యల వల్ల 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో మునిగి పోయిందన్నారు. వైఎస్ పథకాలు కాంగ్రెస్ పథకాలు అని చెప్పుకోవడం కాదని వాటిని అమలు పర్చాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్స్ చెల్లించకపోవడం వల్ల రైతు కుటుంబనుండి వచ్చిన విద్యార్థుల కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఆస్తులు అమ్మి అయినా ఫీజు రీయింబర్స్మెంట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. యువత దేశానికి వెన్నుముక అని, వారిని విస్మరిస్తే ప్రభుత్వాలు మనుగడ సాధించలేవన్నారు. విద్యార్థులు కూడా ఉద్వేగానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడకూడదని కోరారు. ఎవరూ మరో వరలక్ష్మిలా మారకూడదన్నారు. ఒక్కరోజు దీక్ష చేస్తే ప్రభుత్వం కళ్లు తెరవదని, వారం రోజుల దీక్షకు పూనుకున్నారన్నారు.