ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సాయి ట్రస్టు
ట్రస్టు ఆర్థిక వ్యవహారాలను, కార్యకలాపాలను, రెవెన్యూను, తాను నడిపే సంస్థల వివరాలను, రోజువారీ పనితీరును నివేదికలో పొందు పరిచారు. బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిన రాయితీల వివరాలను, మినహాయింపులను కూడా నివేదికలో వివరించారు. ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ట్రస్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే భక్తుల డిమాండును పరిగణనలోకి తీసుకుంటుంది. ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏదైనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విషయంపై కూడా ఆలోచన చేస్తుంది.
గత నాలుగు దశాబ్దాల కాలంలో ట్రస్టు వ్యవహారాల్లో మొదటి సారి ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ట్రస్టు సభ్యులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అనంతపురం పోలీసులు 35 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. ట్రస్టు సభ్యులు రత్నాకర్, శ్రీనివాసన్లను విచారించారు.