సునీల్కు పిటి వారంట్: శ్రవణ్ గుప్తాకు అరెస్టు వారంట్
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ సమర్పించిన అనుబంధ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆ వారంట్లు జారీ చేసింది. సునీల్ రెడ్డిని, విజయరాఘవను ఈ నెల 18వ తేదీన తమ ముందు హాజరు పరచాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. వారిద్దరు ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు.
కాగా, శ్రవణ్ గుప్తా ముందస్తు బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తూ ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ చేసింది. శ్రవణ్ గుప్తాను అరెస్టు చేసి తమ ముందు ఈ నెల 18వ తేదీన హాజరు పరచాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో విజయరాఘవ, శ్రవణ్ గుప్తా కుట్ర చేశారని, శ్రవణ్ గుప్తా కొన్ని విల్లాలను విక్రయించాడని సిబిఐ అనుబంధ చార్జిషీట్లో తెలిపింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కోనేరు రాజేంద్ర ప్రసాద్ ద్వారా రంగారావుకు అందిన 96 కోట్ల రూపాయలు సునీల్ రెడ్డికి చేరాయని, సునీల్ రెడ్డి నుంచి ఆ డబ్బులు ఎవరికి చేరాయనే విషయంపై దర్యాప్తు చేయాల్సి ఉందని, ఆ డబ్బుల చివరి లబ్ధిదారు ఎవరో కనిపెట్టాల్సిన అవసరం ఉందని సిబిఐ అభిప్రాయపడింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన శ్రవణ్ గుప్తా ఇప్పటి వరకు కోర్టుకు రాలేదు.