ఐపిఎస్ అధికారి ఉమేష్పై సస్పెన్షన్ వేటు, ఇదే ప్రథమం
ఇటీవల కొద్ది రోజులు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. వారం నుంచీ విధులకు హాజరు కాకపోవడం.. తనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్షన్ కాలంలో హైదరాబాద్లోనే ఉండాలని షరతు కూడా విధించింది. రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డిజిపి దినేశ్ రెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వెనక ఉమేష్ హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ విచారణలో భాగంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పలుమార్లు ఉమేష్కు ఆదేశాలు జారీ చేసినా ఆయన బేఖాతర్ చేశారు. దీంతో, ఈనెల 14వ తేదీన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దానిని తీసుకున్న సిఐడి అధికారులు ఉమేష్ను అరెస్ట్ చేసేందుకు జూబ్లీహిల్స్లోని ఆయన అధికార నివాసానికి వెళ్లారు.
అయితే, తనను అరెస్టు చేసేందుకు సిఐడి అధికారులు వస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న ఉమేష్కుమార్.. గన్మెన్లను ఇంటి వద్దనే వదిలేసి.. తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనంలో కొంత దూరం వెళ్లి.. అక్కడి నుంచి డ్రైవర్ను వెళ్లిపోవాలని చెప్పి ఆటోలో ఆయన ఎటో వెళ్లిపోయారు. సస్పెన్షన్ను, అరెస్ట్ను తప్పించుకోవడానికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సిఐడి అధికారులు భావించారు.
అప్పటి నుంచి ఆయన విధులకు హాజరు కావడం లేదు. ఎక్కడున్నారో సమాచారం లేదు. అటు అధికారిక నివాసంలో లేకపోవడం.. ఇటు విధులకు కూడా హాజరు కాకపోవడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. నిబంధనల ప్రకారం, అఖిల భారత సర్వీసుల అధికారులు ఎక్కడికి వెళ్లినా.. సెలవు పెట్టినా విధిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగా లేకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే, తనకు సంబంధించిన వివరాలను ఉమేష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారమివ్వలేదు.
దీనికితోడు, ఆయన వ్యవహార శైలిపై డిజిపి దినేశ్ రెడ్డి కూడా సిఎస్ పంకజ్ ద్వివేదికి నివేదిక పంపించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని, ఒకదాని తర్వాత మరొకటిగా తప్పులు చేసుకుంటూ పోతున్నారని, ఐపిఎస్ అధికారిగా ఉండి కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దీంతో, ఉమేష్ విధులకు గైర్హాజరవుతున్నారని భావించిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
తనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అందుకోవడానికి ఉమేష్ కుమార్ ససేమిరా అన్నారు. ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తో ప్రత్యేకంగా పంపించారు. ఉత్తర్వులను అందజేసేందుకు మంగళవారం సాయంత్రం ఇన్స్పెక్టర్ ఉమేష్ నివాసానికి వెళ్లారు. కానీ ఉమేష్ ఉత్తర్వులు తీసుకోలేదు.
దీంతో, ఆ ఇన్స్పెక్టర్ వాటిని వెనక్కి తెచ్చారు. అనంతరం మంగళవారం సాయంత్రం ఉమేష్ కుమార్ అకస్మాత్తుగా సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో భేటీ అయ్యారు. తాను హాజరు కాకపోవడానికి కారణాలను వివరించారు. అయితే, తన చేతిలో ఏమీ లేదని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే సస్పెండ్ చేసినట్లు ఉమేష్కు సిఎస్ వివరించారు. సిఎస్తో భేటీ తర్వాత బయటకు వచ్చిన ఉమేష్ను మీడియా చుట్టుముట్టింది. వారితో ఏమీ మాట్లాడకుండానే ఆయన కారెక్కి వెళ్లిపోయారు.