కిశోర్ చంద్రదేవ్ ఫైట్: సారీ చెప్పిన చిదంబరం
" రాత్రిపూట అడవిలో కాల్పులు జరగడంతో జవాన్లు తిరిగి కాల్చారు. అది వారు ప్రామాణికంగా అనుసరించే పద్ధతే. అందుకు వారినెలా తప్పు పడతాం. అయినా.. ఎన్కౌంటర్ ఆ రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. దీనిపై సీఆర్పీఎఫ్ డీజీ ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఎన్కౌంటర్లో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒక జవాను దవడ పూర్తిగా ఛిద్రమైపోయింది. మృతుల్లో 15 ఏళ్ల బాలుడు తప్ప మిగతా వారందరూ వయోజనులే. మరణించినవారిలో ముగ్గురికి నేర చరిత్ర ఉంది. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు సీఎం రమణ్సింగ్ చెప్పారు. ఆ పని త్వరగా జరపాలి'' అని చిదంబరం వివరణ ఇచ్చారు.
బీజాపూర్ ఎన్కౌంటర్లో అమాయకులైన గిరిజనులను కాల్చి చంపారని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. ఆ ఎన్కౌంటర్లో ఏడుగురు గిరిజనులు మరణించారని, అందులో మైనర్లు కూడా ఉన్నారని 11 మంది కాంగ్రెస్ సభ్యుల కమిటీ తేల్చింది. ముగ్గురు ముఖ్యమైన మావోయిస్టులు మరణించారని చిదంబరం చెప్పడంపై ప్రశ్నించగా, ఆయనకు సరైన సమాచారం లేదన్నారు.
విత్తన ఉత్సవం జరుపు కునేందుకు మూడు గ్రామాలకు చెందిన వారు భేటీఅయిన సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోందని కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ కమిటీలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి చరణ్ దాస్ మహంతో కూడా ఉన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్కు కమిటీ తన నివేదిక సమర్పించింది.
"నాలుగేళ్ల చిన్నారినీ సీఆర్పీఎఫ్ జవాన్లు పొట్టన బెట్టుకున్నా''రంటూ యూపీఏను, చిదంబరాన్ని కిశోర్ చంద్రదేవ్ ఆత్మరక్షణలో పడేశారు. ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాకలో ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. పసిపిల్లలతో సహా అమాయకులైన గిరిపుత్రులను ఎన్కౌంటర్ పేరిట సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు కాల్చి చంపారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కిశోర్ చంద్రదేవ్ ఫిర్యాదు చేశారు.
నక్సలైట్ల పేరుతో పసిపిల్లల్ని పిట్టల్లా కాల్చిచంపారని నివేదించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు లభించిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో తొమ్మిది మంది టీనేజర్లని, అందులో 4-5 సంవత్సరాల వయసున్న ఒక బాలిక కూడా ఉందని చెప్పారు.