పది రోజులు చూస్తాం, 20 నుంచి దూకుడే: కెసిఆర్
స్వామిగౌడ్ను ఆయన తమ పార్టీలోకి అహ్వానించారు. ఇప్పటికే స్వామి గౌడ్ తనకు అండదండలు అందిస్తున్నారని, ఇప్పుడు పార్టీలో చేరాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వామి గౌడ్ మంత్రి అవుతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకమైన ఇంక్రిమెంట్లు ఉంటాయని, కేంద్ర ఉద్యోగుల వేతనాలకు సమానంగా రాష్ట్ర ఉద్యోగుల వేతనాలు ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై అందరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తనంతట తాను తెలంగాణ ఇస్తుందని అనుకోవడ లేదని, ఐదు పది రోజులు వేచి చూద్దామని ఆయన అన్నారు. ఇక పార్టీల్లేవు, జెండాల్లేవు అని ఆయన అన్నారు.
కెసిఆర్ రెండు నెలల నుంచి మౌనంగా ఉంటున్నారని అనుకుంటున్నారని, అలాంటిదేమీ లేదని ఆయన అన్నారు. ఎక్కడ దెబ్బ పెట్టాలో అక్కడ పెట్టాలని, పన్నెండేళ్లుగా ఉద్యమం చేస్తున్నామని, ఎప్పుడు ఏం చేయాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. కెసిఆర్ మౌనంగా ఉంటే ఏదో జరుగుతోందని సీమాంధ్రులు భయపడడం సహజమని ఆయన అన్నారు. కెసిఆర్ మౌనంగా ఉంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నారని అనుకోవాలని ఆయన అన్నారు.
కెసిఆర్కు తెలంగాణపై ఏ విధమైన సంకేతాలు లేవని అన్న విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లగడపాటికి దమాక్ లేదని ఆయన అన్నారు. సిగ్నల్ గిగ్నల్ ఏదైనా ఉంటే ఉద్యమ నేతకు వస్తుంది గానీ లగడపాటికి ఎందుకు వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు కె. కేశవరావు, పొన్నం ప్రభాకర్ చేస్తోంది నిజమైన ఉద్యమేనని తాను స్వయంగా పార్లమెంటులో చూశానని ఆయన అన్నారు.
తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెసు మోసం చేసిందని కాంగ్రెసు నాయకుడు కె. కేశవ రావు అన్నారు. చివరికి ధోకా చేసింది తామేనని ఆయన అన్నారు. తనను కెసిఆర్ ఏజెంట్ అని కొంత మంది అంటున్నారని, అయినా కెసిఆర్తో మ్యాచ్ ఫిక్సింగ్ తెలంగాణ కోసమేనని ఆయన ఆవేశంగా అన్నారు. అన్ని పార్టీలు అనుకూలమైన వైఖరి ప్రకటిస్తే 15 రోజుల్లో తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ నగారా సమితి నాయకుడు, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నాగం జనార్దన్ రెడ్డి రోడ్డున పడ్డారని చంద్రబాబు అంటున్నారని, అవును, మాట తప్పి మోసం చేసిన చంద్రబాబును నిలదీయడానికే తాను రోడ్డు మీదికి వచ్చానని ఆయన అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ మాదిరిగా డిపాజిట్లు పోగొట్టుకోవడం లేదని ఆయన అన్నారు
ఉద్యోగుల పోరాటాలకు రాజకీయ నేతలు సహకరించి ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చి ఉండేదని ఆయన అన్నారు. ఉద్యోగులు, కార్మికులు తెలంగాణ ఉద్యమంలో నష్టపోయారని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు ఏం నష్టపోయారో చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తారంటూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఓట్లు వేసుకుంటూ పోతే ఎప్పుడూ తెలంగాణ ఇవ్వబోరని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.