బైరెడ్డి ధర్నా: సీమ నేతలపై వసంత నాగేశ్వర రావు ఫైర్
బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. సమైక్య రాష్ట్రం వల్ల ప్రయోజనాలు ఉంటాయనేది చెప్పడానికే పనికి వస్తుందని, ఆచరణలో ఏమాత్రం నిజం కాదన్నారు. గ్యాస్ కేటాయింపులలో మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, అయినప్పటికీ 42 మంది పార్లమెంటు సభ్యులు ఉండి ఏమీ చేయలేక పోయారన్నారు. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన నష్టంపై ఎంపీలు మాట్లాడక పోవడం దురదృష్టకరమని ఆయన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను ఉద్దేశించి అన్నారు.
కాగా రాయలసీమ హక్కుల సాధన కోసం రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి శనివారం దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. మేలుకొలుపు పేరిట ఈ దీక్ష నాలుగు రోజుల పాటు సాగుతుందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన తర్వాత ఆయన హంద్రీనీవా తీరంలో దీక్ష ప్రారంభించారు. రాయలసీమ ఉద్యమాన్ని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారనే తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు.
తన దీక్షతో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని, దీక్షకు తెలుగుదేశం పార్టీ అనుమతి కూడా అవసరం లేదని ఆయన అన్నారు. రాయలసీమ కోసం ఈ ప్రాంత నాయకులంతా కలిసి పోరాడాలని ఆయన కోరారు. రాయలసీమ ప్రజలను చైతన్యవంతులను చేయడానికే ఈ దీక్షను చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాయలసీమ పరిరక్షణ సమితి రాజకీయ పార్టీ కాదని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ కోసం అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతానికి స్వస్తి చెప్పి మూడు కళ్ల ధోరణిని అవలంబించాలని ఆయన సూచించారు. రాయలసీమ ప్రజల మనోభావాలు తెలుసుకుని తాను ఈ దీక్షకు దిగుతున్నానని ఆయన చెప్పారు. తాను పార్టీ క్రమశిక్షణను కూడా ఉల్లంఘించలేదని ఆయన అన్నారు. తాను రాయలసీమ రాష్ట్రం కోసం అడుగుతున్నానని ఆయన అన్నారు. పార్టీతో రాయలసీమ విషయం చర్చించలేదని ఆయన అన్నారు. పార్టీకి తన ఉద్యమానికి సంబంధం లేదని ఆయన అన్నారు.
తాను నాటకం ఆడుతున్నాననేది బుద్ధిలేనివాళ్లు అనే మాట అని ఆయన అన్నారు. తమది పరిరక్షణ సమితి కాదని, పోరాట సమితి అని ఆయన అన్నారు. ఎవరు మద్దతిచ్చినా ఇవ్వకపోయినా తన పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. రాయలసీమ వెనుకబాటుతనం, కరువు, కష్టనష్టాలు తెలుపేందుకే దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాయలతెలంగాణ అన్న వారిని ప్రజలు చెప్పుతో కొడతారని బైరెడ్డి రాజశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు.