ఎన్టీఆర్ని దేవుడిగా చూసినప్పుడు: వైఎస్పై విజయమ్మ
విద్యార్థిగా ఉండగానే జలయజ్ఞాన్ని స్వప్నించారని, జగన్ బాధలను స్వయంగా చూసి అర్థం చేసుకునే వారని, కష్టాల్లో ఉండగానే పలకరించాలంటూ పాదయాత్ర చేశారని, సిఎం అయ్యాకే తమతో కాస్త సమయం గడిపారని విజయమ్మ చెప్పారు. ఇడుపులపాయ ఎస్టేట్ అంటే వైయస్కు చాలా ఇష్టమని చెప్పారు. ఆయన లేరనుకుంటే బాధేస్తుందని, ప్రజలకు ఆయనపై భరోసా ఉండేదన్నారు. వారానికి ఐదు రోజులు ఆయన ప్రజల మధ్యే ఉండేవారన్నారు. రాష్ట్రంలో ఆయన తిరగని ప్రాంతం లేదన్నారు.
వైయస్పై వెంకటప్ప సార్ ప్రభావం ఎక్కువని చెప్పారు. ఒక మంచి మనిషిగా ఆయన ఓ రోల్ మోడల్ అన్నారు. కళ్లలోకి చూసి ఎవరి బాధనైనా ఇట్టే పసిగట్టే వారని, మండుటెండల్లో పాదయాత్రకు పూనుకున్నప్పుడు తనకు చాలా భయమేసిందని విజయమ్మ చెప్పారు. ఎన్నడూ వైయస్కు అడ్డు చెప్పని తొలిసారి పాదయాత్ర వాయిదా వేసుకోమని చెబితే.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే వాళ్ల దగ్గరకెళ్లాలని చెప్పారన్నారు. అన్నట్టుగానే ఆయన పాదయాత్ర చేశారని గుర్తు చేసుకున్నారు.
ప్రజల కోసమే ప్రభుత్వమని ఆయన చెప్పేవారన్నారు. పిల్లలకు క్రమశిక్షణ గురించి చెప్పే వారని, పై చదువులకు జగన్ను అమెరికా పంపినప్పుడు వైయస్ ఉండలేక పోయారన్నారు. జగన్ కూడా నెలకు మించి ఉండలేక పోయారన్నారు. ఆయన మృతి చెందినప్పుడు రాష్ట్రమంతా బాధపడిందని గుర్తు చేసుకున్నారు. పంచెకట్టే ఆయనకు చాలా అందంగా ఉండేదని చెప్పారు. ఇంట్లో పేపర్ చదివాక కూడా నీట్గా మడచి పెట్టే వారన్నారు.
ఆయనకు టైం సెన్స్ ఎక్కువ అని, ఫలానా సమయానికి ఫలానా చోటికి వెళ్లాలంటే వెళ్లి తీరాల్సిందే అన్నారు. వైయస్ జీవితంలో కష్టాలే ఎక్కువ అని, స్వర్గీయ ఎన్టీఆర్ టిడిపి పెట్టినప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారని, జనం ఎన్టీఆర్ని దేవుడిగా చూసే వారని, అప్పుడు కాంగ్రెసు పార్టీ మీటింగ్ పెట్టాలన్నా కష్టంగా ఉండేదని, అలాంటి సమయంలో ఆస్తులమ్మీ కాంగ్రెసు కోసం వైయస్ పని చేశారన్నారు. 2004 నాటికి వైయస్కు రాష్ట్రంలో తిరుగులేని ప్రజాభిమానం, ప్రజాబలం లభించాయని, ఇప్పుడు కూడా ఆయనను సిఎం చేయకపోతే వేరే పార్టీ పెడతారేమోననే భయంతోనే కాంగ్రెసు సిఎం చేసిందన్నారు.
2009లో పార్టీని ఒంటి చేత్తో నడిపించి మరోసారి సిఎం అయ్యారనన్నారు. ఆయన లాగే తాము కూడా కాంగ్రెసు విడిచి వెళ్లాలని తాము ఏనాడు భావించలేదన్నారు. కానీ చెప్పుడు మాటలు వినే నాయకత్వం తీరు వల్లే తాము బయటకు వచ్చామన్నారు. వైయస్ వివేకాకు మంత్రి పదవి ఇస్తే సంతోషించామన్నారు. కానీ దానిని ఆయుధంగా చేసుకొని మా కుటుంబంలో చీలిక తేవాలని, చూసిందని దాంతో బయటకు రాక తప్పలేదన్నారు.
వైయస్కు పాత పాటలంటే ఇష్టమన్నారు. 2009లో 156 సీట్లే వచ్చినప్పుడు వైయస్ జనం పాస్ మార్కులే ఇచ్చారని బాధపడ్డారని చెప్పారు. తాను కూడా తన తండ్రిలాగే ప్రజల కోసం బతుకుతానని జగన్ తనతో అన్నారని విజయమ్మ చెప్పారు. జగన్కు తన తండ్రి ఆ పేరు పెట్టారని, సమయం, నక్షత్రం చూసి తన తండ్రి ఆ పేరు పెట్టారన్నారు. మంచి రాజు కావాలంటే ప్రజల కష్ట సుఖాలు తెలుసుండాలని, అందుకే దేవుడు జగన్ను ఇలా నడిపిస్తున్నాడేమోనని విజయమ్మ చెప్పారు.