జగన్కు సంబంధం లేదు కానీ: సిబిఐ, జడ్జి అసంతృప్తి

బెయిల్ ఎందుకు మంజూరు చేయరాదో సూటిగా చెప్పాలని, వెనుకనున్న వారిని సంతృప్తి పర్చడానికే (ప్రేక్షకుల గాలరీలో జర్నలిస్టులు, సిబిఐ డిఐజి వెంకటేష్, అధికారులు ఇతరులున్నారు) అన్నట్లు మీ వాదనలు ఉంటున్నాయని, కోర్టు సంతృప్తి మేరకు వాదనలు చెప్పాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు హితవు పలికారు. అంతకు ముందు సిబిఐ తరపు న్యాయవాది కేశవ రావు తన వాదనల్లో భాగంగా చార్జిషీటులోని పలు అంశాలను ప్రస్తావిస్తూ పోయారు.
చార్జిషీటులోని అంశాలు వద్దని, నిమ్మగడ్డ ప్రసాద్కు బెయిల్ ఎందుకు మంజూరు చేయరాదో సూటిగా చెప్పాలని జడ్జి సూచించారు. కేసుకు సంబంధించిన అంశాలనే కోర్టు ముందుంచుతానని చెప్పిన కేశవరావు తిరిగి వాదనలు కొనసాగించారు. ప్రాజెక్టు.. ఒప్పందం వివరాలను ఆయన చెబుతుండడంతో.. ఇవి ఇక్కడ చేయాల్సినవి వాదనలు కావని, బెయిల్ ఎందుకు ఇవ్వరాదో చెప్పమంటే ఇవన్నీ ఏమిటని తిరిగి ప్రశ్నించారు.
అంతేకాకుండా వాన్పిక్కు, జగన్కు ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అందుకు సిబిఐ న్యాయవాది వాన్పిక్ ప్రాజెక్టుతో జగన్కు ప్రత్యక్ష సంబంధం లేదని, ఆ సంస్థకు భారీగా భూములు కేటాయించడానికి ప్రభుత్వంపై జగన్ పరోక్షంగా ఒత్తిడి తెచ్చారని సీబీఐ న్యాయవాది వివరించారు. కోర్టు సమయం ముగియడంతో కేసు విచారణ గురువారానికి వాయిదా పడింది. సిబిఐ లాయరు వాదనలు వినిపిస్తున్న సమయంలో పలుమార్లు న్యాయమూర్తి ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications