ఓ బిడ్డ జైల్లో ఓ బిడ్డ రోడ్డుపై: కన్నీరుకార్చిన విజయమ్మ
ఓ బిడ్డ జైలులో ఉండగా మరో బిడ్డ రోడ్డు పైన ఉన్నారని విజయమ్మ గద్గద స్వరంతో చెప్పారు. షర్మిల పాదయాత్ర ప్రారంభ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మీరు ఉన్నారనే ధైర్యంతోనే తన కూతురును పాదయాత్రకు పంపిస్తున్నానని కన్నీరు కార్చారు. తన కూతురు షర్మిలను మీకు అప్పగిస్తున్నానని అన్నారు. ఆమెను ఆదరించి.. ఆశీర్వదించమని విజయమ్మ ప్రజలను విజ్ఞప్తి చేశారు. తన తనయుడు జగన్ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపించారన్నారు.
ప్రజలపై కొండంత నమ్మకంతో తన బిడ్డ షర్మిలను ప్రజా క్షేత్రంలోకి పంపిస్తున్నానని చెప్పారు. షర్మిల పాదయాత్ర ఎందుకు చేపట్టవలసి వచ్చిందో ఆమె ఉద్వేగభరితంగా చెప్పారు. జగన్ను ఆదరించినట్లుగానే షర్మిలను ఆదరించాలని కోరారు. కాంగ్రెసు, టిడిపి, సిబిఐ కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల భరోసానే తమ కుటుంబానికి ఉందన్నారు. ప్రజల అండదండలు తమకు ఉంటాయని చెప్పారు. వైయస్ను ప్రేమించే ప్రతి హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు.