కసబ్ ఉరి: 'ఆపరేషన్ ఎక్స్ విజయవంతంగా పూర్తైంది'
ముంబయి: ముంబయి మారణ హోమం నిందితుడు అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలకు 'ఆపరేషన్కు ఎక్స్' అనే పేరు పెట్టారు. కసబ్ను సోమవారం (21 నవంబర్ 2012) ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో అత్యంత గోప్యంగా పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీసిన విషయం తెలిసిందే. దీని అమలుకు ఆపరేషన్ ఎక్స్ అనే పేరును పెట్టారు. ఆపరేషన్ ఎక్స్ ప్రత్యేక లా అండ్ ఆర్డర్ ఐజి దేవన్ భారతి నేతృత్వంలో గప్చుప్గా సాగిపోయింది.
ఉదయం ఏడున్నరకు అజ్మల్ కసబ్ను ఉరి తీశారనే వార్త కేవలం భారత్ దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. దేవన్ భారతి నేతృత్వంలో ఆపరేషన్ ఎక్స్ నవంబర్ 5వ తారీఖు నుండి ప్రారంభమైంది. కసబ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అదే రోజు తిరస్కరించారు. ఆ తర్వాత నుండి దేవన్ జట్టు తమ ఆపరేషన్ను అత్యంత గోప్యంగా ప్రారంభించింది.
ఈ ఆపరేషన్లో దేవన్ భారతితో సహా పదిహేడు మంది సీనియర్ అధికారులు ఉన్నారు. సమాచారం మేరకు ఈ ఆపరేషన్లో పాల్గొన్న అధికారులందరి ఫోన్లు ఆపరేషన్ ప్రారంభం అయినప్పటి నుండి స్విచ్చాఫ్లో ఉన్నాయి. కేవలం దేవన్ భారతి ఫోన్ మాత్రమే పని చేసినట్లుగా సమాచారం.
కసబ్ను ముంబయి జైలు నుండి పూణే ఎరవాడ జైలుకు తరలించే బాధ్యతను దేవన్ భారతి అండ్ కో సమర్థవంతంగా పూర్తి చేసింది. ఆపరేషన్ ఎక్స్ పూర్తయ్యే వరకు ఎవరికీ ఎలాంటి సమాచారం అందలేదు. ఈ రోజు ఉదయం కసబ్ను ఉరి తీసిన తర్వాత దేవన్ భారతి ''ఆపరేషన్ ఎక్స్ విజయవంతంగా పూర్తయింద''ని సందేశమిచ్చారు. ఆ తర్వాత అది వెలుగులోకి వచ్చింది.
కాగా కసబ్ ఉరిశిక్ష తేదిని కోర్టు నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం చెప్పారు.