జగన్, బాబువైపు చెరొకరు: 'బిల్లు'తో కిరణ్ చెక్
ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే ఎందుకంటే... వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అంటున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జనాభా ఎన్నికల గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అలాంటి వారు ఇప్పటి వరకు కాంగ్రెసు వెన్నంటి ఉన్నారు! అయితే ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ వర్గాలు తమ పార్టీకి దూరమయ్యాయనే ఆందోళన కాంగ్రెసు నాయకుల్లో కనిపిస్తోందని అంటున్నారు.
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. సీమాంధ్రలో మాల సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఆ వర్గంలోని చాలామంది తమ మతాన్ని మార్చుకున్నారు. జగన్ కూడా అదే మతానికి చెందిన వ్యక్తి. దీంతో ఆ వర్గం నేతలు జగన్ వైపు మొగ్గుచూపుతున్నట్లుగా కనిపిస్తోంది. పలు సర్వేల్లో కూడా ఇది వాస్తవమేనని తేలింది.
మరోవైపు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు తెలిపారు. పార్టీ అధికారికంగా దీనిని ప్రకటించింది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు చంద్రబాబు వర్గీకరణకు మద్దతు పలికారు. దీంతో మాదిగ సామాజిగ వర్గం టిడిపి వైపు క్రమంగా మొగ్గు చూపుతుంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చంద్రబాబు పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఎస్టీల కోసం కూడా చంద్రబాబు పోరు సల్పడానికి సిద్ధమని చెప్పారు.
ఇలా గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన మాదిగ, మాల, లంబాడి సామాజిక వర్గాలు తమ పార్టీకి దూరమవుతుండటం గమనించిన కాంగ్రెసు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లును తీసుకు వచ్చిందని అంటున్నారు. ఈ బిల్లుతో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసుల వైపు చూస్తున్న వర్గాలు తిరిగి తమ చెంతకు చేరుతాయని కాంగ్రెసు భావించడం వల్లనే ఈ బిల్లు రూపకల్పన, సభలో ప్రవేశ పెట్టడం జరిగిందని అంటున్నారు.