కేసు అప్పగింతకు ఎన్ఐఎ: మేమే అంటున్న ఎపి పోలీసు
కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సిపి సందీప్ శాండిల్య నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. మూడు పోలీసు బృందాలు ఈ సిట్లో ఉంటాయి. ఎన్ఐఎ కేసు దర్యాప్తును తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ స్థితిలో ఇప్పుడు కేసు దర్యాప్తు ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తమకు కేసు అప్పగించకపోవడంపై ఎన్ఐఎ అధికారులు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే జోక్యాన్ని కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
కేసు దర్యాప్తును తమ పోలీసు బృందాలు మాత్రమే చేస్తారని, ఎన్ఎఐ దేశంలోని ఇతర ప్రాంతాల్లోని లీడ్స్ను చూస్తుందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి అన్నారు. కేసును తమకు బదిలీ చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని, సమాధానం కోసం తాము ఎదురు చూస్తున్నామని ఎన్ఐఎ ఐజి రవిశంకర్ శుక్రవారం మీడియాతో చెప్పారు.
వెంకటాద్రి థియేటర్ వద్ద జరిగిన పేలుడుపై మొదట మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును శుక్రవారం సిట్కు బదిలీ చేశారు. కోణార్క్ థియేటర్ వద్ద జరిగిన పేలుడుపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.