పాక్ ఐఎస్ఐకి పేలుళ్ల గుట్టు చెప్పిన ఎన్ఎస్జీ అధికారి
ఈ ఘటన కొద్ది రోజుల కిందట జరిగిందని, దీనిపై అంతర్గతంగా దర్యాప్తునకు ఆదేశించామని ఎన్ఎస్జీ అధిపతి అరవింద్ రంజన్ తెలిపారు. ఎన్ఎస్జీ అధికారి, పాకిస్థానీ మధ్య సంభాషణ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కీలక వివరాలను వెల్లడించలేదని తెలిపారు. పాకిస్థానీని ఐఎస్ఐ ఏజెంట్గా భావిస్తున్నామన్నారు.
ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే కేవలం మూడున్నర గంటల్లోనే ఎన్ఎస్జీ అధికారులు హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పేలుళ్ల స్థలానికి ఎన్ఎస్జీ బృందం కదలికల గురించి సదరు అధికారి ఐఎస్ఐ ఏజెంటుకు వివరించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతే తప్పితే, పేలుళ్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఏవీ తెలియజేయలేదని వివరించాయి. వాళ్లిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారని, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దీనిని కనుగొన్నారని, వారి సంభాషణ వివరాలను ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి వివరించారని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే, నిఘా, భద్రతా సంస్థల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని, గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్లో కానీ, వ్యక్తిగతంగా గానీ, ఇంటర్నెట్ తదితర సమాచార సాధనాల్లో కానీ మాట్లాడవద్దని అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూనే ఉంటారని ఆ వర్గాలు వివరించాయి.