హైదరాబాద్ పేలుళ్లపై కేంద్రం గరం: సిపిలపై బదిలీ వేటు?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. పేలుళ్ల ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర నిఘా విభాగం ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహించిందని కేంద్రం అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
నిఘా వర్గాల సమాచారాన్ని తీ।వంగా పరిగణించకపోవడంవల్ల దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందనే ఆగ్రహంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖను ప్రక్షాళన చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
కేంద్ర సూచనలతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అనురాగ్ శర్మ, ద్వారకా తిరుమలరావులపై బదిలీ వేటు పడే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే కొంతమంది ఎసిపి, డిసిపిలపై కూడా బదిలీ వేటు పడే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు.
గత నెల 21వ తేదీన దిల్షుక్నగర్లోని వెంకటాద్రి, కోణార్క్ థియేటర్ల వద్ద బాంబు పేలుళ్లు సంభవించి 17 మంది మరణించారు. ఈ సంఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఈ పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది.