'ఎన్టీఆర్' టిడిపి చచ్చిపోయింది, కిరణ్పై నోటీసు: కెసిఆర్
టిడిపి నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. అవిశ్వాసం టిడిపి ప్రవేశ పెడుతుందని భావించామని కానీ, ఆ పార్టీ ముందుకు రాకపోవడంతో తాము ప్రవేశ పెట్టామని, వారు కలిసి వస్తారనే ఉద్దేశ్యంతోనే అవిశ్వాసం పెట్టామన్నారు. మజ్లిస్ పార్టీ తమతో కలిసి రాకపోవడం ఆ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అది చాలా దురదృష్టకరమన్నారు. కిరణ్ కేవలం సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా కనిపిస్తోందన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెసు నేతలతో ప్రస్తావిస్తానన్నారు. సిఎం వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించరన్నారు. బస్తీమే సవాల్ అని ముఖ్యమంత్రి అనడం పద్ధతి కాదన్నారు. హోదా పెరిగే కొద్ది హుందాగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభా హక్కుల నోటీసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
టిడిపి, కాంగ్రెసులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. తెలంగాణపై ఏప్రిల్ మొదటి వారంలోగా తేల్చాలన్నారు. తెలంగాణ కోసం శరద్ పవార్, ఇతర మద్దతుదారులను కలిసి మాట్లాడుతానని చెప్పారు. కెసిఆర్, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించేందుకే తాము ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టకుంటే సభను స్తంభింప చేస్తామన్నారు.