దిల్షుక్నగర్ పేలుళ్లు: జుమేరాత్ బజార్ సైకిళ్లు?
పేలుళ్లకు పాల్పడిన రోజునే ఉగ్రవాదులను ఆ సైకిళ్లను కొన్నట్లు భావిస్తున్నారు. గురువారం ఫిబ్రవరి 21వ తేదీన పేలుళ్లు సంభవించాయి. ప్రతి గురువారంనాడు జుమేరాత్ బజార్ ఉంటుంది. ఉదయం పూట ఉగ్రవాదులు సైకిళ్లను కొన్ని సాయంత్రం వాడినట్లు చెబుతున్నారు.
రెండు సైకిళ్లలో ఒకటి నడపడానికి వీలు లేనంత పాతదని, మరోటి మాత్రం కొత్తదని ఎన్ఐఎ అధికారులు ఆర్ఎస్ బ్రదర్స్ దుస్తుల దుకాణం సిసిటివీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు సమాచారం. సైకిళ్ల ముందు భాగాలు మాత్రమే ధ్వంసం కాకుండా దర్యాప్తు అధికారులకు చిక్కాయి. బాంబులు పెట్డిన సైకిళ్ల వెనకభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సంఘటనా స్థలంలో సైబరాబాద్, హైదరాబాదు పోలీసులు సేకరించిన వస్తువులను ఎన్ఐఎ అధికారులు పరిశీలించారు. సెకండ్ హ్యాండ్ సైకిళ్లపై గల రేడియం స్టిక్కర్లను వారు పరిశీలించారు. ఎన్ఐఎ అధికారులు గురువారంనాడు జుమేరాత్ బజార్కు వెళ్లి ప్రదేశాన్ని, సైకిళ్ల వ్యాపారులను వీడియో తీశారు. పేలుళ్లకు వాడిన సైకిళ్లు కొత్తవి కాదని, మరమ్మత్తు చేసిన పాత సైకిళ్లని పోలీసులు గుర్తించారు.
జుమేరాత్ బజార్లోని సైకిళ్ల వ్యాపారులను సైబరాబాద్ పోలీసులు రెడ్ హిల్స్లోని ఎపి స్టేట్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి తీసుకుని వెళ్లి సైకిళ్లపై ఆరా తీశారు. అయితే, వాళ్లు సైకిళ్ల విడిభాగాలను గుర్తించలేకపోయారు. అయితే, ఉగ్రవాదులు సైకిళ్లను ఎవరి వద్ద కొన్నారనేది ఇప్పటికీ తేలలేదు.