బన్సల్, అశ్వినీ ఔట్: జైపాల్కు రైల్వే, ఆజాద్కు హోం?
2014 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. కపిల్ సిబాల్కు న్యాయశాఖను అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ప్రస్తుతం సుశీల్ కుమార్ షిండే చేతిలో ఉన్న హోం శాఖను గులాం నబీ ఆజాద్కు అప్పగిస్తారని అంటున్నారు. ఇక రైల్వే శాఖను జైపాల్ రెడ్డికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద, శాఖల్లో సోమవారం మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగవచ్చునని కూడా అంటున్నారు.
బన్సాల్ రాజీనామా చేయక తప్పదని అంటున్నారు. లేదంటే ఆయనకు ఉద్వాసన పలికవచ్చునని చెబుతున్నారు. బన్సాల్ను సిబిఐ ఏ క్షణంలోనైనా విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ సమావేశానికి బన్సాల్ హాజరు కాలేదు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరినప్పటికీ కార్యాలయానికి మాత్రం చేరుకోలేదు. కాగా, తన సొంత వాహనంలోనే ఆయన ప్రయాణిస్తున్నారు.
కాగా, అశ్వినీ కుమార్ కూడా రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన శాఖను మార్చే ఆలోచనలో ప్రధాని ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న న్యాయశాఖను కపిల్ సిబాల్కు అప్పగించవచ్చునని అంటున్నారు. బన్సాల్, అశ్వినీ కుమార్లను కొనసాగించాలనే పట్టుదలతో మన్మోహన్ సింగ్ ఉన్నట్లు చెబుతన్నారు. సోనియా గాంధీ మాత్రం వారిద్దరిని తప్పించాలని వాదిస్తున్నట్లు తెలుస్తోంది.
శనివారం జరిగే కాంగ్రెసు కీలక సమావేశంలో అశ్వినీ కుమార్, బన్సాల్ల భవిష్యత్తు తేలిపోతుందని అంటున్నారు. బన్సాల్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. కోల్ గేట్ కేసులో సిబిఐ నివేదికను మార్చారనే ఆరోపణలను అశ్వినీ కుమార్ ఎదుర్కుంటున్నారు.