డబ్బులుంటే టిక్కెట్లా?: కెసిఆర్కు టిడిపి, ఓయు ఉద్రిక్తం
ఐకాస ఓ రాజకీయ పార్టీకి తొత్తుగా మారడం బాధాకరమన్నారు. మహానాడులో తెలంగాణ పట్ల స్పష్టమైన తీర్మానం చేశామన్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానం అవసరం లేదని కెసిఆరే చెప్పారని గుర్తు చేశారు. డబ్బులున్న వారికే టిక్కెట్లు ఇస్తే.. తెలంగాణవాదాన్ని నమ్ముకునే వారి పరిస్థితి ఏమిటని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కాంగ్రెసుకు కోదండరామ్, కెసిఆర్ అమ్ముడుపోయారన్నారు. కాంగ్రెసుకు వారు తొత్తయ్యారని విమర్శించారు.
ఓయు విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తం
ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ ఓయు విద్యార్థులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు ఎన్సిసి గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు వారి పైన రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులపై పోలీసులు మూడు రౌండ్లు బాష్పవాయు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు.
షిండే వ్యాఖ్యలు సరికాదు: పోచారం
తెలంగాణపై ఏకాభిప్రాయం లేదన్న కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలను తెరాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ఏకాభిప్రాయంతోనే అప్పుడు రాష్ట్రాన్ని కలిపారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలను వచ్చే ఎన్నికలలో ఓడించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను వెల్లడించేందుకే ఛలో అసెంబ్లీని చేపడుతున్నట్లు చెప్పారు.