దాసరి మెడకు బొగ్గు ఉచ్చు: షిండే ఆదేశాలు బేఖాతరు
బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సిబిఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో జిందాల్తో పాటు దాసరి పేరు చేర్చారు. నవీన్ జిందాల్ సంస్థ నాలుగు బ్లాకులను కేటాయించాల్సిందిగా కోరుతూ దరఖాస్తులు దాఖలు చేసింది. జార్ఖండ్లో ఈ బ్లాకులున్నాయి. జిందాల్ కంపెనీతోపాటు భూషన్ ఎనర్జీ అన్న సంస్థ కూడా ఈ బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ రెండు సంస్థలకు రెండేసి బ్లాకులను కేటాయించాల్సిందిగా షిండే చేసిన ప్రతిపాదనను పక్కన పెట్టి దాసరి మొత్తం నాలుగింటిని జిందాల్ స్టీల్ పవర్ కంపెనీకి కేటాయించినట్లు సిబిఐ గుర్తించిందని అంటున్నారు.
కేటాయింపులు జరగకముందు, జరిగిన తరువాత రెండు శాఖల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు సిబిఐ ఆధీనంలో ఉన్నాయి. వీటి ప్రాతిపదికపైనే విచారణ జరుగుతుందని సిబిఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. దాసరి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒక్క జార్ఖండ్లోనే ఆరువందల అరవై మూడు మిలియన్ టన్నుల బొగ్గు గనులు జిందాల్కు లభించాయి. ఇందుకు ప్రతిఫలంగానే జిందాల్ గ్రూపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను దాసరికి చెందిన మీడియా సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్టు సిబిఐకి దొరికిన పత్రాల్లో బయటపడింది.
జిందాల్- దాసరి మధ్య ఇచ్చిపుచ్చుకునే తీరులో లావాదేవీలు జరగటమేకాక గనుల కేటాయింపు ఖరారు చేసే స్క్రీనింగ్ కమిటీలోని సభ్యులపై దాసరి వివిధ రూపాలలో ఒత్తిడి తీసుకొచ్చారని సిబిఐ భావిస్తోంది. దాసరికి చెందిన మీడీయా సంస్థలో పెట్టిన రెండు కోట్ల రూపాయల పెట్టుబడిపైనే కాక మరిన్ని అనుబంధ అంశాలపై సిబిఐ దృష్టి కేంద్రీకరిస్తోంది.
తమకు లభించిన నాలుగు బ్లాకుల్లో మూడింటిలో జిందాల్ గ్రూపు తవ్వకాలు ప్రారంభించింది. దాసరి దిగిపోయిన తరువాత ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖ పర్యవేక్షకునిగా ఉన్నప్పుడు జరిగిన కేటాయింపులో ఒడిషాలో 1500 మిలియన్ టన్నుల గనులు లభించాయి. ప్రస్తుతానికి జిందాల్ స్టీల్ పవర్ సంస్థ ఆధీనంలో 2600 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.