చలి పులి: వణుకుతున్న తెలంగాణ పల్లెలు, గజ గజ
తెలంగాణ రాష్ట్రంలో చలి పెరిగింది. ఆగ్నేయ, తూర్పు దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగగా.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు ఇలానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చలికి తోడు దట్టంగా పొగమంచు కూడా కురుస్తోంది.
రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తీర్మాణి మండలం గిన్నెదరిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.వికారాబాద్ మర్పల్లిలో 11.1, సంగారెడ్డి జిల్లా కోహిర్, కుమ్రం భీం సిర్పూర్ 11.3, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి 11.4, సెంట్రల్ వర్సిటీ, బోథ్ మండలం సోనాల 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తెలంగాణ రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్నాం కూడా టెంపరేచర్ తగ్గి.. చలి గాలులు వీయడంతో జనం వణుకుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది తుఫాను, అల్పపీడనం, వాయుగుండం వల్ల చలి తీవ్రత అంతగా లేదు. ఇటీవలే స్టార్ట్ అయి.. ఆ తర్వాత మెల్లగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు ఏజెన్సీ ఏరియాలో చలిపులికి గిరిజనులు వణుకుతున్నారు. చలికాలం ప్రారంభమైన రెండు నెలలు గడిచినా అంతగా చలి లేదు. వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది.
ఉన్ని వస్త్రాలు ధరించనిదే బయటకు రాలేకపోతున్నారు. గోదావరి తీర ప్రాంత గ్రామాల ప్రజలు, ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ చలి వీడడం లేదు. రాత్రిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఏజెన్సీలో కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోవడంతో గిరిజనులు వణుకుతున్నారు.చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్లు, ఉన్ని కోట్లు, రగ్గులు, జర్కిన్లు, మంకీ క్యాప్లు ధరిస్తున్నారు. చలి మంటలు, కుంపట్ల వద్ద కాలక్షేపం చేస్తున్నారు. చలికి దగ్గు, జలుబు వంటి వ్యాధులు ప్రజలను బాధిస్తున్నాయి. కొంతమంది వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. ఉబ్బసం, ఆస్తమా, టీబీ రోగులు నానా అవస్థలు పడుతున్నారు. చలికాలంలో ఎక్కువుగా వృద్ధులు, పిల్లలు న్యుమోనియా వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. రక్తపోటు పెరిగి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్మం పొడిబారిపోతుంది. సోరియాసిస్ వంటి చర్మవ్యాధుల తీవ్రత ఎక్కువ అవుతాయి. మంచు ఎక్కువుగా పడడం వల్ల గొంతు సంబంధిత వ్యాధులు ప్రజలను బాధిస్తున్నాయి.