సంచలనం...నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1280 మంది విద్యార్థులపై వేటు
కృష్ణా జిల్లా: మరో సంచలన నిర్ణయంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో కెక్కింది. ఒకేసారి 1280 మంది విద్యార్థులపై అనర్హత వేటు వేసి ఈ విద్యాసంస్థ రికార్డు సృష్టించింది. విద్యార్థులు తరగతులకు సుదీర్ఘకాలం హాజరుకానందుకు ప్రతిగా ట్రిపుల్ ఐటీ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో భయాందోళనకు లోనైన విద్యార్ధులు సెలవులు పెట్టి ఇళ్ళకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే అలా ఇంటికి వెళ్లిన విద్యార్థులు నెలలు గడుస్తున్నా తిరిగి కళాశాలకు రాలేదని, తరగతులకు హాజరుకావడం లేదని సమాచారం. సంక్రాంతి సెలవులకు ముందు కళాశాల నుంచి వెళ్లిన విద్యార్థులు ఆ సెలవులు అయిపోయి మరో నెల రోజులు గడుస్తున్నాఈనాటికి తిరిగి క్లాసులకు హాజరుకావడం లేదు.
దీంతో విద్యార్థులకు నిబంధనల ప్రకారం ఉండాల్సిన హాజరుశాతం తగ్గడంతో ట్రిపుల్ ఐటి మేనేజ్ మెంట్ 1280 మంది విద్యార్ధులపై అనర్హత వేటు వేసి సెమిస్టర్-2 పరీక్షలకు అనుమతిని నిరాకరించారు. అయితే ఇది తమపై కక్ష్య సాధింపు చర్యగా విద్యార్థులు అభివర్ణిస్తున్నారు. అయితే తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, హాజరు శాతం తగ్గితే పరీక్షలకు అనుమతించక పోవడం విద్యా చట్టంలో ఎప్పటినుంచో ఉన్నదేనని ట్రిపుల్ ఐటీ మేనేజ్ మెంట్ వాదిస్తున్నట్లు తెలిసింది.