ఆరుగురిపై వేటు: ఇతరులు అవిశ్వాసానికి దూరమే?
న్యూఢిల్లీ: యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన ఆరుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. వారిపై విప్ కొరడా ఝళిపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వారు క్రమశిక్షణ గల కాంగ్రెసు సైనికులని, క్రమశిక్షణను ఉల్లంఘించారని తేలితే వారిపై చర్యలు ఉంటాయని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం అన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసును వారు ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు.
లోకసభ నాయకుడైన సుశీల్ కుమార్ షిండే సభలో గందరగోళం చెలరేగడం వల్ల తీర్మానాన్ని చేపట్టలేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో స్పీకర్ తన పని తాను చేస్తారని, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుందని అన్నారు. తీర్మానానికి స్పీకర్ అంగీకారం చెబుతారా అని అడిగితే ఆయన ఆ విధంగా అన్నారు. అయితే, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఆరుగురు పార్లమెంటు సభ్యులు చెబుతున్నారు.
ఈ ప్రభుత్వం పడిపోవాల్సిందేనని లగడపాటి రాజగోపాల్ తాజాగా మంగళవారం కూడా అన్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున నిలిచిన ఎస్పీవై రెడ్డి మీద కూడా వేటు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయన కాంగ్రెసు తరఫున పోటీ చేసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అందువల్ల ఆయనపై వేటు వేసే అవకాశాలుంటాయని అంటున్నారు. లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, హర్ష కుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు.
కాగా, సీమాంధ్రకు చెందిన లోకసభ సభ్యులు కేంద్ర మంత్రులతో కలిసి 25 మంది ఉన్నారు. వీరంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తారా అనేది అనుమానమే. కావూరి సాంబశివ రావు సహా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు ఎవరు కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఇప్పటికే, రాయలసీమకు చెందిన పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు.
తాను అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేనని చెప్పారు. పది సార్లు ఎంపిగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెసుపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేనని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ కూడా అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. అలాగే, కనుమూరి బాపిరాజు కూడా దానికి దూరంగా ఉండవచ్చు.
ఆరుగురు పార్లమెంటు సభ్యులపై వేటు వేసే విషయంపై లోకసభ నేత సుశీల్ కుమార్ షిండే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్తో చర్చించి అందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కూడా యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చాయి. మూడు నోటీసులపై కూడా స్పీకర్ మీరా కుమార్ ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగానే ఉంది.
కాగా, బిజూ జనతాదళ్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించింది. పార్టీ నేత జయపాండా ట్విట్టర్లో ఈ విషయం చెప్పారు. ఈ పార్టీకి 14 మంది సభ్యుల బలం ఉంది. అన్నాడియంకె, తృణమూల్ కాంగ్రెసు పార్టీల మద్దతు కూడా లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 40 మంది పార్లమెంటు సభ్యుల మద్దతును కూడగట్టినట్లు తెలుస్తోంది.