టీలో బిజెపికి 8, 45 సీట్లు: సీమాంధ్రపై సస్పెన్స్
సీమాంధ్ర స్థానాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. మంగళవారంనాడు అకాలీదళ్ ఎంపీ నరేశ్ గుజ్రాల్ నివాసంలో బిజెపి అగ్రనేతలు జైట్లీ, జవదేకర్, తెలుగుదేశం ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణరావు, సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. అయితే, చర్చలు వాయిదా పడ్డాయి సీమాంధ్రలో 4 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది.
5 లోక్సభ, కనీసం 15 అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. అవి కూడా తమకు నచ్చిన స్థానాలు కేటాయించాలని గట్టిగా అడుగుతుండటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఏది ఏమైనా బుధవారం ఉదయానికి చర్చల్ని ముగిస్తామని, వెంటనే పొత్తుపై అధికారిక ప్రకటన వెలువరిస్తామని వారు వెల్లడిస్తున్నారు. సీట్ల సంఖ్యపై అవగాహన వచ్చేస్తే ఏయే స్థానాలు కేటాయించాలన్న దానిపై కూడా తక్షణం చర్చించేందుకు వీలుగా తెలంగాణ టిడిపి నేతలు ఇప్పటికే ఢిల్లీలో సిద్ధంగా ఉన్నారు.
బిజెపి రాష్ట్ర నాయకులు మాత్రం చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు. తాము చెప్పాల్సింది ఇప్పటికే తమ అధిష్ఠానం పెద్దలకు చెప్పేశామని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారంటున్నారు. చర్చల మధ్యలో బీజేపీ అధిష్ఠానం పెద్దలు తమ రాష్ట్ర శాఖ నాయకులతో ఫోన్లో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు సమాచారం.