పొన్నాల ఎఫెక్ట్: ఆమోస్ రిజైన్, పోన్నాలపై కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఉపాధ్యక్ష పదవికి కెఆర్ ఆమోస్ శుక్రవారం రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయనందుకు నిరసనగా ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు ఆమోస్ తెలిపారు. ఈ మేరకు పొన్నాలకు లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎపి సిఎం చంద్రబాబు, టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్యయ్య పైన మండిపడ్డారు. పిపిఏలను రద్దు చేయడం ద్వారా చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామనే భ్రమలో ఆయన ఉన్నారన్నారు. పొన్నాల ప్రెస్ మీట్ లక్ష్మయ్యగా మారాడన్నారు. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే ఇతర నేతలు కూడా రాజీనామా చేయాలన్నారు. టిపిసిసి బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతామన్నారు.
మరోవైపు ఎపి ప్రభుత్వం పిపిఏ రద్దు చేయాలను కోవడం సరికాదని డి శ్రీనివాస్ అన్నారు. విభజన చట్టంలోని వాటిని ఇరు రాష్ట్రాలు ఉల్లంఘించవద్దన్నారు. సమైక్య రాష్ట్రంలో చేసిన విద్యుత్ పిపిఏలను ఎపి ప్రభుత్వం రద్దు చేయాలనడం ఏకపక్ష నిర్ణయమన్నారు. చమురు ఉత్పత్తులపై అంతర్రాష్ట్ర పన్ను విధించాలని కోరడం సరికాదన్నారు.
నాయుళ్లిద్దరూ తప్పుదోవపట్టిస్తున్నారు: పాల్వాయి
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలవరం విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని వివరాలు తెలిపానన్నారు. సానుకూలంగా స్పందించిన మోడీ తెలంగాణకు అన్యాయం జరగనీయమని చెప్పారని, డిజైన్ మార్చితేనే పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ, గిరిజన శాఖ అనుమతులు లభిస్తాయన్నారు.
ఆ కార్పోరేషన్లపై కాంగ్రెస్ కన్ను
తెలంగాణలో ఎన్నికలు జరగని మూడు కార్పొరేషన్లలో పాగా వేయడానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ కార్పొరేషన్లలో నవంబర్/డిసెంబర్లలో ఎన్నికలు జరిగే అవకాశముంది. అప్పటి వరకు తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడే వ్యతిరేకత, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా మూడు కార్పొరేషన్లను చేజిక్కించుకోవాలని చూస్తోంది.
పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ, జి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. చాలామంది పౌరులు రెండు చోట్ల ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల కాంగ్రెస్కే నష్టం కలిగిస్తున్నట్లు పార్టీ నేతలు కొంతమంది అభిప్రాయపడ్డారు.
అందుకే డ్యుయెల్ ఓటింపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలన్న అంశంపై శుక్రవారం టి-కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో సమావేశం కానున్నారు.