జులై 31 నుంచి ఏపీ ఎక్స్ప్రెస్?, రాజధాని కోసం బంగారు ఆభరణాలు..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ పేర్కొంది. కొత్త ఏపీ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు వెళుతుంది.
ఏపీ ఎక్స్ప్రెస్ను ఎప్పటి నుంచి కావాలంటే అప్పటి నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, మంత్రి వెంకయ్యకు చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి వెంకయ్య రాష్ట్ర నేతలకు తెలిపారు.
దీంతో ఏపీ ఎక్స్ప్రెస్కు ఆగస్టు 1న విశాఖపట్నంలో స్వాగతం చెబుతామని, ఎపీ ఎక్స్ప్రెస్ను ఢిల్లీలో కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, వెంకయ్యలు ప్రారంభించాల్సిందిగా ఏపీ రాష్ట్ర నేతలు కోరినట్టు తెలిసింది.
రాజధాని కోసం ఆభరణాలిచ్చిన మోదుకూరు వాసి
నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి స్వార్ధం వీడి తమవంతు సాయం చేయాలని మోదుకూరువాసి యరమాటి శ్రీమహాలక్ష్మీ పిలుపునిచ్చారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో నూతన రాజధాని నిర్మాణానికి తనవంతుగా తన బంగారు ఆభరణాలను సీఎంకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి తనకు వారసత్వ సంపదగా వచ్చిన నగలు ఒక మంచి కార్యక్రమం కోసం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాను ప్రస్తుతం సింగపూర్లో ఉంటున్నానని, అయినా తాను తెలుగింటి ఆడపడుచునని చెప్పారు.
చంద్రబాబు నాయుడు మంచి పరిపాలనాదక్షుడని ఆమె కొనియాడారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ శ్రీమహాలక్ష్మీ ఔదార్యం గొప్పదని, అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ప్రతిఒక్కరూ ఒక ఇటుకకు సమానమైన సాయం అందించాలని పిలుపునిచ్చారు.