బాబుకు అమిత్ షా షాక్, టిడిపి డౌన్డౌన్: టి-బిజెపి దారిలో ఏపీ బిజెపి?
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు కూడా తెలంగాణ బిజెపి నేతల దారిలో నడుస్తున్నారు! ఏపీలో టిడిపితో పొత్తు వద్దని, ఒంటరిగా ముందుకు పోదామని పలువురు నేతలు తమ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు సూచించారని తెలుస్తోంది.
తెలంగాణలో టిడిపితో కలిసి ముందుకు సాగడం తెలంగాణ బిజెపి నేతలకు మొదటి నుంచి ఇష్టం లేదు. అధిష్టానం ఒత్తిడి కారణంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, ఇతర ఎన్నికల్లో టిడిపితో జత కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అనంతరం.. వరంగల్ కార్పోరేషన్లో వేరుపడ్డారు.
ఇదే విషయాన్ని తెలంగాణ బిజెపి నేతలు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు. టిడిపితో కలిసి ఉంటే లాభం లేదని, తాము ఒంటరిగా ముందుకు వెళ్తామని చెప్పారు. అధిష్టానం పచ్చ జెండా ఊపడంతో ఇటీవల జరిగిన వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా ముందుకెళ్లారు.
అధికారికంగా టిడిపి, బిజెపి మధ్య తెలంగాణలో ఫ్రెండ్ షిప్ చెరిగిపోనప్పటికీ.. దాదాపు ఆ దరి చేరిందనుకోవచ్చు. ఇప్పుడు ఏపీలోను టిడిపి పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన బిజెపిలో అసంతృప్తి సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. కొందరు బిజెపి నేతలు మొదటి నుంచి టిడిపితో కస్సుబుస్సుగా ఉంటున్నారు.
తాజాగా, అమిత్ షా పర్యటన నేపథ్యంలో టిడిపికి దూరం జరగాలని పలువురు నేతలు కోరినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో కొందరు బిజెపి కార్యకర్తలు టిడిపితో పొత్తు వద్దంటూ నినాదాలు చేశారు.
అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో వేదికకు కొద్ది దూరంలో కొంతమంది కార్యకర్తలు టిడిపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన బిజెపి నాయకులు వారిని వారించారు. అదే సమయంలో అమిత్ షా.. సూటిగా, సున్నితంగా ఏపీ ప్రభుత్వానికి నిధుల విషయంలో కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్ని నిధులు ఇచ్చామో వెల్లడించారు.