నేనెవరికీ భయపడను...కేంద్రం మెడలు వంచుతా;బైటకు రాననుకున్నారు:సిఎం చంద్రబాబు
ఒంగోలు:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..."నేనెవరికీ భయపడను...కేంద్రం మెడలు వంచుతాను"...అని వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మార్టూరు మండలం డేగరమూడిలో జరిగిన గ్రామదర్శినిలో సిఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. విభజన హామీలను నెరవేర్చమని కేంద్రాన్ని అడిగితే అది దాడులకు దిగుతోందని మండిపడ్డారు. టీడీపీ నేతల ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని ఐటీ సోదాలు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తాను కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రాననుకున్నారని...కానీ వారి ఊహలను తల్లకిందులు చేస్తే తిరగబడ్డానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు జాతీయస్థాయిలో అందరినీ కూడగడుతున్నానని చంద్రబాబు వెల్లడించారు. అసలు అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కుందా?...అని ప్రశ్నించారు. ప్రజలు కులం, మతం చూసి ఓట్లు వేయరాదని...అభివృద్ధిని చూసి ఓటేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఏకపక్షంగా ఓటేసి గెలిపించాలని ప్రజలను చంద్రబాబు పిలుపునిచ్చారు.
అంతకుముందు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తురు సమీపం లోని నిర్మాణంలో ఉన్న వెలుగొండప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మొదటిసొరంగం లో 2కిలో మీటర్లు లోపలకు వెళ్ళివచ్చారు. అనంతరం
మొదటి సొరంగం తవ్వకం పనులు కన్వేయర్ బెల్ట్ ను స్విచ్ ఆన్ చేయడం ద్వారా ప్రారంభించారు.
తరువాత వెలుగొండ గెస్ట్ హౌస్ లో అధికారులతో సొరంగ పనుల స్ధితిగతుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 20రోజులలో పూర్తిస్తాయిలో పనులు పున:ప్రారంభమవుతాయని...
ఫిబ్రవరి లేక మార్చి కల్లా వెలుగొండ మొదటి సొరంగం నుండి నీళ్ళిస్తామని తెలిపారు. 1996 లో తానే వెలుగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించానని చెప్పారు. రెండవ సొరంగం పనులను వచ్చే సీజన్ లో మొదలపెడతామన్నారు.
వెలుగొండప్రాజెక్ట్ ను పూర్తి చేయ్యడమే తన లక్ష్యం అని ప్రకటించారు.












Click it and Unblock the Notifications