జగన్ పాదయాత్రపై..."ఇంటెలిజెన్స్" కన్ను:అన్నికోణాల్లో ఆరా
తూర్పుగోదావరి:జగన్ పాదయాత్రకు జనం ఎంతమంది వస్తున్నారు?...ఎలా వస్తున్నారు?...స్వచ్చందంగా వస్తున్నారా? సమీకరిస్తేనే వస్తున్నారా?...జగన్ పై ఆ వచ్చిన వాళ్ల అభిప్రాయం ఏమిటి?...వాళ్లు జగన్ ప్రసంగాల పట్ల ఎలా స్పందిస్తున్నారు?...ఏ అంశాలకు స్పందిస్తున్నారు?...ఏమిటీ ఈ ప్రశ్నల పరంపర అనుకుంటున్నారా?...
Recommended Video
ఈ ప్రశ్నలన్నింటికీ ప్రస్తుతం సమాధానం వెతికే పనిలో ఉందట ఎపి ఇంటెలిజెన్స్...ఎన్నికలు అంతకంతకూ దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రపై జనాల మనోగతం ఏమిటో తెలుసుకునేందుకు అధికార పార్టీగా టిడిపి తనకున్న వెసులుబాటులను వినియోగించుకుంటోందట. ఆ క్రమంలోనే విపక్ష నేత జగన్ పాదయాత్రపై ప్రజా స్పందన తెలుసుకోమని ఎపి ఇంటెలిజెన్స్ ను ఆదేశించినట్లు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే...
జగన్ పాదయాత్ర...2400 కి.మీకి చేరిక
ప్రజాసమస్యలను తెలుసుకునే లక్ష్యంతో ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర 195 రోజులు పూర్తిచేసుకుంది. గురువారం తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర పదో రోజు శివకోడు నుంచి చింతలపల్లి కొనసాగింది. ఈ క్రమంలో జగన్ పాదయాత్ర చింతలపల్లి క్రాస్ వద్ద 2400 కిలోమీటర్ల మైలురాయి దాటారు. ఈ సందర్భంగా చింతలపల్లి బ్రిడ్జి వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను జగన్ కట్ చేశారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
మరోవైపు...ఇంటెలిజెన్స్ ఐ
ఇదిలా ఉంటే ప్రభుత్వం అదేశానుసారం పోలీస్ శాఖలో కీలక విభాగం ఇంటెలిజెన్స్ జగన్ పాదయాత్ర మీద ప్రస్తుతం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రతిపక్షాల కదలికలపై ఇంటెలిజెన్స్ కన్నేయడం కామనే అయినా ఈసారి తమకు అందిన ప్రత్యేక ఆదేశాలను బట్టి జగన్ పాదయాత్రపై స్పెషల్ నజర్ పెట్టిందని సమాచారం. ఆ ప్రకారం జగన్ పాదయాత్ర, మీటింగ్లకు జనం ఏ స్థాయిలో హాజరవుతున్నారు? జగన్ ప్రసంగాలకు ఏ విధంగా స్పందన వస్తోంది? ...వంటి అంశాలతో సహా జగన్ పాదయాత్రకు సంబంధించిన టోటల్ ఫీడ్ బ్యాక్ ను ఇంటెలిజెన్స్ విభాగం రాబడుతోందట.
జనాల రాకడ...ఎలా ఉందంటే?
ప్రస్తుతం జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుండగా ఇదే జిల్లాలో మరో 25 రోజులు పాదయాత్ర కొనసాగి సుమారుగా జులై 15 న విశాఖ జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉంది. అయితే జగన్ పాదయాత్రకు వస్తున్న జనంలో ఎంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు?...ఎంతమందిని వైసిపి నేతలు సమీకరిస్తున్నారు..? ...వంటి అంశాలతో సహా జనాల స్పందన తదితర అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. రాజమహేంద్రవరం, రావులపాలెం, గన్నవరం, రాజోలు ప్రాంతాలలో ప్రజా స్పందనపై ఇంటిలిజెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్లు సమాచారం. రాజమహేంద్రవరంలో జక్కంపూడి కుటుంబం జగన్కి స్వాగతం చెప్పేందుకు భారీగా జన సమీకరణ చేశారని, అలాగే రావులపాలెంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా భారీగా జనాన్ని సమీకరించారని... అయితే రాజోలు పాదయాత్రలో జనం పాల్గొన్నది అంతంతమాత్రంగానేనని ఇంటెలిజెన్స్ విభాగం అధికారుల ఆరాలో తేలిందట.
ప్రసంగాలపై...స్పందన గురించి
ఇక జగన్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటుచేస్తున్న బహిరంగ సభల్లో చంద్రబాబుపై ప్రతిపక్షనేత చేస్తున్న విమర్శల పట్ల వైసిపి శ్రేణులతో పాటు ప్రజలు ఏ రీతిలో ప్రతిస్పందిస్తున్నారనే విషయంపై సమాచారం సేకరణ ప్రభుత్వం అధికార పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది.అలాగే జగన్ ఇస్తున్న హామీల విషయమై జనాలు ఏ విధంగా స్పందిస్తున్నారు...అందులోనూ ఏఏ చోట్ల...ఏఏ వర్గాలు ఏ విధంగా స్పందిస్తున్నాయనేది కూడా ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణమంటున్న జగన్ ఆరోపణలపై ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారనేది గమనిస్తున్నారట.
మరోవైపు...జగన్ సొంత సర్వే...
ఇదిలావుంటే ప్రతిపక్షనేత జగన్ తన పాదయాత్ర జరిపిన ప్రాంతాలలో వైసీపీ ఏ మేరకు బలపడిందనే దానిపై అతడి సొంత టీమ్తో సర్వే నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదించిందట. అలాగే పాదయాత్రకు ముందు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది?...పాదయాత్ర తర్వాత ఎలా ఉంది?... అనే విషయాలపైనా జగన్ టీమ్ కూడా విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో పార్టీ బలాలు, బలహీనతలను గుర్తించి తదుపరి జరపబోయే పాదయాత్రలో ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గుర్తించారు.