ఏపీలో లోకల్ వార్: ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోమారు రద్దు..నెక్స్ట్ ఏంటి ? సర్వత్రా ఉత్కంఠ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జగన్ సర్కార్ కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది . ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల సంఘం కసరత్తు కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు ,జడ్పీ సీఈవోలు , పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మరో లేఖ రాశారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మళ్ళీ లేఖ రాసినా స్పందించని సర్కార్ తీరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి షాక్ గా మారింది.
మరోమారు వీడియో కాన్ఫరెన్స్ రద్దు ... ఎస్ఈసి సమావేశానికి అధికారుల గైర్హాజరు
ఇప్పటికే బుధవారం జరగవలసిన మీటింగ్ రద్దు కావడంతో, నేడు మరోమారు సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు జరగాల్సిన సమావేశానికి అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కు రాసిన లేఖలో కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు నేడు కూడా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు అనుమతి రాలేదు.
ప్రభుత్వ తీరుపై ఎస్ఈసీ అసహనం ... రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం తదుపరి కార్యాచరణపై ఆసక్తి
ఏపీ ప్రభుత్వం నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం కోసం అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. ఇక నేడు కూడా ఉదయం 10 గంటలనుండి 12 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా, కలెక్టర్లకు ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో ఇవాల్టి వీడియో కాన్ఫరెన్స్ కూడా రద్దు కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీఎస్ నీలం సాహ్నిపై ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఎస్ఈసి
ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించటం లేదని హైకోర్టు ఆదేశాలను సీఎస్ నీలం సాహ్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన గవర్నర్ కు చెప్పినట్లుగా సమాచారం. అంతేకాదు ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహణ జరుగుతోందని, ఏపీలో కరోనా కారణంగా ఏ ఒక్క కార్యకలాపాన్ని కూడా వాయిదా వేయలేదని స్కూళ్ళు కూడా నడుస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు.
Recommended Video
ఏపీలో ఒక ప్రహసనంగా స్థానిక ఎన్నికల నిర్వహణ...ఏం జరుగుతుంది ?
ఎవరికి వారు పట్టు విడవకుండా నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతుందా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ , ప్రభుత్వ యంత్రాంగం సహకరించకపోతే ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాలకు ఏవిధంగా బ్రేక్ వేయబోతున్నారు ? ఈ సహాయ నిరాకరణ ఇలాగే కొనసాగుతుందా ? గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటారా ? లేదా మరోమారు కోర్టు మెట్లు ఎక్కుతారా? అనేది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ చోటు చేసుకోని కారణంగా స్థానిక ఎన్నికల నిర్వహణ ఏపీలో ఒక ప్రహసనంగా మారింది .