మోడీకి భయమా! మూడేళ్లు పడుకున్నావా?: బాబుకు తెలుసంటూ జగన్పై అచ్చెన్న నిప్పులు
Recommended Video

అమరావతి: రాజీనామాలంటూ మరోసారి కొత్త నాటకానికి తెరతీశారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ రాజీపడబోదని స్పష్టం చేశారు.

మూడేళ్లు పడుకున్నావా?
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 2016 నుంచి మూడు బడ్జెట్లు అయిపోయాయని, అప్పుడెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఈ మూడేళ్లు పడుకున్నావా? అంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. హోదా ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని 2016లోనే ప్రకటించిన జగన్.. మాట తప్పారని అన్నారు.

జగన్ రాజీ డ్రామాలు
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్ మరోసారి రాజీనామా నాటకాలు ఆడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ గుర్తించడం లేదనే జగన్ రాజీడ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

విజయసాయిరెడ్డి బాగుందంటారా?
టీడీపీకి అధికారం ముఖ్యం కాదని, తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే.. జగన్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బడ్జెట్ బాగుందని ప్రశంసిస్తారా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు తెలుసు
రాష్ట్ర ప్రయోజనాల కోసం మడమ తిప్పని పోరాటం చేస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అవసరమైన సమయంలో ఏం చేయాలో తెలుసునని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు 29సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని అన్నారు. మిత్ర ధర్మ పాటిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.

మోడీకి భయమా?
టీడీపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు పార్లమెంటులో ఏపీ వాదనను బలంగా వినిపించారని గుర్తు చేశారు. మోడీకి భయపడాల్సిన అవసరం ఏముందని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications