బోటు ప్రమాదం: బినామీలతో అధికారులే బోటు నడిపిస్తున్నారా?
Recommended Video
అమరావతి: కృష్ణా జిల్లా లో పడవ బోల్తా పడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా 19 మంది ని స్థానిక మత్స్యకారులు,ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. బోటులో సుమారు 40 మంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ ఎఫ్ దళాలు గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నుంచి బైటపడి అస్వస్థతకు గురైనవారికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!
ప్రమాద కారణాలు ఇవి
అయితే ఈ ప్రమాదానికి పూర్తిగా పర్యాటక శాఖదే బాధ్యతని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారణం ప్రమాదం మొదటి నుంచి చివరి వరకు పర్యాటక శాఖ సిబ్బందిదే కర్త కర్మ క్రియ అనేది స్థానికులు చెబుతున్న సమాచారం బట్టి అర్ధమవుతోంది. కేవలం పున్నమి ఘాట్ నుంచి భవాని ఐలాండ్ వరకు ఇద్దరు పాసింజర్లను చేర్చడానికి మాత్రమే స్పీడ్ బోటుకు వారు అనుమతి తీసుకున్నారు. కానీ ఇదే బోటును వారు పర్మిషన్ తీసుకున్న రూట్ తో సంబంధం లేకుండా కార్తీకమాసం సందర్భంగా వచ్చిన పర్యాటకులను నదిలో తిప్పడానికి పెద్ద మొత్తంలో వారి నుంచి డబ్బులు వసూలు చేసి విహార యాత్రకు వినియోగించారు.
ప్రయాణికులందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వాలి కానీ
ప్రయాణికులందరికి లైఫ్ జాకెట్లు ఇవ్వాల్సి ఉండగా వారి వద్ద ఉన్న పదింటిని మాత్రమే ఇచ్చారు. మిగతా వారు అడిగితే అవసరం లేదని, లైఫ్ జాకెట్లు లేవని చెప్పారు. మరోవైపు పర్యాటక శాఖ బోట్లు యాత్రికులకు అందుబాటులో లేకుండా చేయడం, కేవలం ఈ ప్రయివేట్ బోటుకి లబ్ది చేకూర్చడానికే అనే వాదన వినిపిస్తోంది.
టూరిజం శాఖ వారిదే బాధ్యత
ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న వారు కూడా తాము టూరిజం శాఖ బోట్లు అందుబాటులో లేకే ప్రయివేట్ బోట్ ఎక్కామంటున్నారు.ఇదంతా ఒక వైపయితే అసలు ఈ బోటు పర్యాటక శాఖలో పనిచేసే అధికారులదేనని, వారు బినామీ పేరుతో ఈ బోటును ఇక్కడ నడుపుతున్నారని స్థానికులు తేల్చి చెబుతున్నారు. కొండలరావు అనే వ్యక్తి పేరు మీద రివర్ బోటింగ్ అడ్వంచర్స్ సంస్థ రిజిస్టర్ అయి ఉన్నా అసలు యజమానులు మాత్రం పర్యాటక శాఖ లోని అధికారులే అంటున్నారు. అందుకే ఆ బోటు అనుమతి లేకున్నా ప్రయాణికులను ఇస్టారాజ్యంగా ఎక్కించుకొని యధేచ్చగా నదిలో చక్కర్లు కొట్టగలిగిందని అంటున్నారు.
బోటు నడిపే వారికి అంతమంది ప్రయాణీకులతో నడపరాదు
అయితే ఆ బోటు నడిపే వారికి ఇంతమంది ప్రయాణికులతో ఆ బోటును నడపడం కూడా రాదని, అయినా పరిమితిని మించి పెద్ద సంఖ్యలో యాత్రికులను ఎక్కించుకొని ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రివర్ బోటింగ్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన పర్యాటక శాఖ ఉద్యోగులు ఈ ప్రమాదంతో ఆందోళన చెంది తమ పేర్లు బైటకి రాకుండా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ముందుగా రివర్ బోటింగ్ అడ్వంచర్స్ సంస్థ యజమానితో సహా సిబ్బంది అంతా పరారీలో ఉండటంతో ఈ సంస్థ వెనుక వాస్తవాలు వెలుగుచూసేందుకు మరికొంత సమయం పడుతుంది. అయితే పర్యాటక మంత్రి అఖిల ప్రియ మాత్రం ఈ ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపి బాధ్యలపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పటికే ప్రమాదానికి కారకులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే బోటు ప్రమాదంపై విచారణలో తమ వారి ప్రమేయం ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తప్పవంటున్నారు.
పరిహారం చెల్లింపు
ఈ ప్రమాదంలో మృతులంతా ఒంగోలు వాకర్స్ క్లబ్ కు చెందిన వారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారికి చంద్రన్న భీమా ఉంటే 10 లక్షలు, చంద్రన్న బీమా లేకుంటే 8 లక్షలు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదానికి సంబంధించి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800450101.