ఏటీఎంలో లేడీ టెక్కీని బెదిరించి చోరీ: నిందితుడి పట్టివేత (వీడియో)
హైదరాబాద్: కొన్ని గంటల్లోనే పోలీసులు అధికారులు ఎటిఎం దోపిడీ కేసును ఛేదించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని నుంచి ఎటిఎం కార్డు, బంగారు, నగలు, తుపాకి, మూడు తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని పెద్దపల్లి శివకుమార్ రెడ్డిగా గుర్తించారు. అతనిది కడప జిల్లా కల్లూరు గ్రామం. అతన్ని హైదరాబాదులోని అమీర్ పేటలో అరెస్టు చేశారు.
యూసుఫ్ గూడ ఏటీఎం దోపిడీ కేసులో విచారణ వేగవంతమై కొలిక్కి వచ్చింది. ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరా ఫుటేజీలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు సాఫ్టువేర్ ఇంజనీర్ డబ్బులు డ్రా చేస్తుండగా.. అగంతకుడు హఠాత్తుగా వచ్చి, కాల్పులు జరిపి, ఆమె వద్ద నుండి బంగారం, డబ్పులు దోచుకున్న విషయం తెలిసిందే.
ఆమె పైన దాడి జరిగిన వీడియో విడుదలైంది. ముసుగుతో లోపలకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తాను కష్టాల్లో ఉన్నానని, నగదు కావాలని తుపాకీతో బెదిరించాడు. ఈ బెదిరింపుల వీడియో క్లిప్పింగును పోలీసులు గురువారం విడుదల చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అతడు బెదిరించి, బయటకు వెళ్లే వరకు ఉన్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
ఐతే అతడు ముసుగుతో రావడంతో కచ్చితంగా నిందితుడిని గుర్తించడం కష్టంగా మారుతోంది. కాగా, విచారణను వేగవంతం చేశామని వెస్ట్ జోన్ డీసీపీ గురువారం సాయంత్రం చెప్పారు. ఆరు బృందాలతో విచారణ జరిపిస్తున్నామన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నామన్నారు. నిందితుడుకి సంబంధించి చాలా అధారాలు లభించాయని చెప్పారు.