కృష్ణా జిల్లాలో దారుణం: ఇద్దరు పిల్లలతో సహా హోంగార్డు ఆత్మహత్య
అమరావతి: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలతో హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మోపిదేవి మండలం పెదప్రోలుకు చెందిన యదలపల్లి రమేశ్ (38)
చల్లపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇతనికి కార్తీక్ (7), శ్రావ్య (4) పిల్లలు ఉన్నారు. ఇటీవలే ఇంట్లో ఉన్న తన అత్తమామలతో గొడవ పడి వేరు కాపురం పెట్టాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తన ఇద్దరు పిల్లలను బైక్పై ఎక్కించుకుని ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
శుక్రవారం ఉదయం చల్లపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం కోడూరు మండలం సాగర సంగమం వద్ద రమేష్ బైక్ను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఉల్లిపాలెం గ్రామ సమీపాన రమేష్, శ్రావ్యలు శవమై కనిపించారు. అయితే కార్తిక్ మృతదేహాం ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్ధిక సమస్యలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే రమేశ్ తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు అనారోగ్యం కారణంగా కూడా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే తాను మాత్రమే ఆత్మహత్య చేసుకుంటాడని, కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను కూడా ఆత్మహత్యకు పాల్పడేలా ఎందుకు చేస్తాడని మరో కోణంలో పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications