నింబంధనలకు తూట్లు: చంద్రబాబు ప్రయాణించే విమానానికి లైసెన్సు లేదు
చంద్రబాబు తన పర్య టనల కోసం నిత్యం వినియోగించే విమానం అన్ని నిబంధనలకు అనుగుణంగానే నడుస్తోందా... ఒక వీవీఐపీ వ్యక్తి విమానంలో ప్రయాణించేటప్పుడు ఈ విమానాయాన సంస్థ అన్ని జాగ్రత్తలు పాటిస్తోందా...? ఈ విమానం గాల్లో ఎగిరేందుకు అన్ని అనుమతులు ఉన్నాయా అంటే లేవనే తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలకోసం తరుచూ ఒకే విమానంలో ప్రయాణిస్తారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ పేరు ది ఎంబ్రార్ వీటీ సీకేపీ. సీఎం చంద్రబాబుతో పాటు అతని అనుచరగణాన్ని ఈ ఫ్లైట్ మోసుకెళుతుంది . అయితే ఇంతమంది వీఐపీలను మోసుకెళుతున్న ఈ విమానం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ విమానం గాల్లోకి ఎగురుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రయాణించే విమానం ప్రైవేట్ విమానం. దీనికి నాన్ షెడ్యూల్ ఆపరేటర్ పర్మిట్ లేదు. కమర్షియల్ ఆపరేషన్స్ లైసెన్స్ లేదు. అంటే ఇది నిబంధనలకు వ్యతిరేకంగా టేకాఫ్ అవుతోంది... ల్యాండ్ అవుతోంది. వీఐపీలు ప్రయాణిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన భద్రత జాగ్రత్తలు ఈ విమానం యాజమాన్యం తీసుకోవడం లేదు. ఎంబ్రార్ వీటీ సీకేపీ అనే ఈ ప్రైవేట్ విమానం... నవయుగ కంపెనీకి చెందినది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కేవలం ఆ యజమానిని, అతిథులను తీసుకెళ్లేందుకు మాత్రమే వినియోగిస్తారు.
2009లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ క్రాష్లో మృతి చెందారు. ఆ ఘటన చూసి కూడా భద్రతా అంశాలను పాటించకపోవడం విమర్శలు వస్తున్నాయి. గత మూడేళ్లలో ఎంబ్రార్ వీటీ సీకేపీ విమానంలో సీఎం చంద్రబాబు 200 సార్లు ప్రయాణించినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం 50 సార్లే ఈ విమానంలో ప్రయాణించారని చెబుతోంది. ఈ విమానం నవయుగ కంపెనీ యాజమాన్యం సీఎంకు ఉచితంగా ఇస్తుందని కేవలం ఇంధనం, ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఫీజు మాత్రమే చెల్లిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. కమర్షియల్ ఫ్లైట్ కిందే దీన్ని ట్రీట్ చేస్తారు.
ఇదిలా ఉంటే ఈ విమానంను ఒక సంవత్సరం నుంచి వినియోగించడంలేదని.. అదే సమయంలో ఈ ప్రాంతంలో ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్లు లేనందున నవయుగ కంపెనీకి చెందిన విమానంను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తున్నామని సీఎం ఆఫీస్ తెలిపింది. ఒక వైపు సీఎం కార్యాలయం నుంచి ఒక ఏడాదిగా విమానం వినియోగించడం లేదనే ప్రకటన వెలువడగా... ఆ సమయంలో విమానంకు మరమత్తులు చేస్తున్నట్లు వెలుగు చూసింది.