కుప్పం ఎమ్మెల్యే బాబు సమైక్యానికి నిలబడ్తారా: అశోక్
హైదరాబాద్: కుప్పం శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు కట్టుబడుతారో, రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తారో స్పష్టం చేయాలని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే పార్టీలను త్వరలోనే కలుస్తామని ఆయన చెప్పారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలకు విభజన అంశం గురించి ముందుగానే తెలుసుననే భావన ప్రజల్లో ఉందని ఆయన చెప్పారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా రాజకీయ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను తాము భుజాన వేసుకున్నామని అశోక్ బాబు అన్నారు. తమ సమ్మె పట్ల సంతృప్తితో ఉన్నామని, సీమాంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ వివరించగలిగామని ఆయన అన్నారు.
డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాజీనామా చేసిన నేతలు ఇప్పుడు ఎందుకు చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలు రెండు రాష్ట్రాల ప్రజలను మోసం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమ్మెలో భాగంగా సీమాంధ్ర ప్రజల కష్టాలు చూసైనా రాజకీయ నేతల్లో చలనం రాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications