చిన జీయర్ స్వామి సలహాలు తీసుకుంటాం: గుట్టపై కెసిఆర్
నల్లగొండ: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట అభివృద్ధికి చిన్న జీయర్ స్వామి సలహాలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. యాదగిరిగుట్టను సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. గుట్ట అభివృద్ధిపై ఆలయ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. భక్తులు పరిపూర్ణ ఆధ్యాత్మిక భావన పొందడంతో పాటు నిత్య జీవన ఒత్తిడి నుంచి విముక్తి పొందే వాతావరణాన్ని గుట్టలో కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం నిర్మాణాలు జరగాలన్నారు. ప్రస్తుతం ఉన్న వాటిలో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. కెసిఆర్ బుధవారంనాడు యాదగిరీశుడిని దర్శించుకున్నారు.
చినజీయర్ స్వామిని కూడా త్వరలోనే గుట్టకు తీసుకొచ్చి ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. గుట్టపై యాగశాల, ప్రవచన శాల, వంట శాల, వ్రత శాల ఏర్పాటు చేయాలన్నారు. 500 గదులు ఉండేలా కాటేజ్ నిర్మించాలన్నారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు 4 లైన్ల రోడ్డును నిర్మించాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం ఆదేశించారు. గుట్టకు నాలుగు వైపుల ఉన్న వంగపల్లి, తుర్కపల్లి, రాయగిరి, రాజపేట రోడ్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. రోడ్ల పక్కన ఆకర్షణీయమైన, సుగంధాలను వెదజల్లే పూల మొక్కలు నాటాలని సూచించారు.
నాలుగు దిక్కుల నుంచి గుట్టకు వెళ్లే మార్గంలో ప్రవేశించగానే వేద మంత్రాలు, స్తోత్రాలు, భక్తి గీతాలు, ఆలయ ప్రకటనలు వినిపించేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా భక్తి భావాన్ని పెంచే, నైతిక విలువలు పెంపొందించే, పర్యావరణాన్ని కాపాడే విధంగా రాతలు కనిపించాలని సూచించారు. గుట్ట పైభాగంలో దాదాపు 14.5 ఎకరాల స్థలం ఉందని దీనిని అణువణువు సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలన్నారు.
ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మించాలని సూచించారు. చాలా దూరం నుంచి కూడా గోపురం, ఆలయం చక్కగా కనిపించేలా నిర్మించాలని చెప్పారు. గుట్టలో నిర్మించే ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహానికి కావాల్సిన రాయి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంచి నైపుణ్యం కలిగిన శిల్పులకు బాధ్యత అప్పగించాలన్నారు. తాను ఎప్పటికప్పుడు గుట్టకు వస్తుంటానని, పనులు పర్యవేక్షిస్తానని కెసిఆర్ చెప్పారు
ఆగమశాస్త్ర నిబంధనలకు లోబడే యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తామని స్థపతి సుందరరాజన్ స్పష్టం చేశారు. సమీక్షాసమావేశం ముగిసిన అనంతరం స్థపతి సుందరరాజన్ మాట్లాడారు. గర్భ గుడిలో మార్పులు లేకుండా ఆలయ అభివృద్ధి చేపడుతామని పేర్కొన్నారు. రెండు వారాల్లో పూర్తి స్థాయిలో ఆలయ నమూనాను ఖరారు చేస్తామన్నారు. ఏప్రిల్లో అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. గుట్టలో పూర్తిస్థాయి అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారని తెలిపారు. ఆలయాన్ని 7, 8 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. గుట్ట అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో రూ. 100 కేటాయిస్తామని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు.