సవాల్: 'ఫాస్ట్'పై హైకోర్టుకు కేసీఆర్ అభిమాని డొక్కా
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) జీవోను సవాల్ చేస్తూ మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఫాస్ట్ జీవోను కొట్టి వేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. అలాగే విద్యార్థులకు ఫీజులు చెల్లించే ఫీజు రీయింబర్సుమెంట్స్, ప్రవేశాల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే అనుసరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు.
తెలంగాణలో 1956 నవంబర్ 1నాటికి స్థిరపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకే ఫాస్ట్ పథకం అమలు చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు 36ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్నారు. రాజ్యాంగం ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇది పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉందన్నారు. కాగా, ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.
కాగా, వారం రోజుల క్రితం డొక్కా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను కేసీఆర్ అభిమానిని అని, ఆయన అంటే రోజు రోజుకు గౌరవం పెరుగుతోందన్నారు. దళితులకు మూడెకరాల భమి, మైనార్టీలకు రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలు మంచి ఆలోచన అని కితాబిచ్చారు. ఈ విషయాల పైన మంచిపేరు తెచ్చుకుంటన్న కేసీఆర్ 'స్థానికత' పైన కన్ఫూజన్లో ఉన్నారన్నారు.
ఫీజురీయింబర్స్మెంట్స్ అంశానికి సంబంధించి స్థానికతను 1956కు అనడం గందరగోళానికి దారి తీస్తుందన్నారు. ఫీజు రీయంబర్సుమెంట్స్ పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకోవాలని హితవు పలికారు. గవర్నర్ జోక్యం చేసుకొని దీనిని పరిష్కరించాలన్నారు.