దటీజ్ మహేష్, తర్వాత మాట్లాడ్తా: గల్లా, ఇంటింటికీ మహేష్ హెల్త్ కార్డ్లు
బుర్రిపాలెం: సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆయన ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఆయన సామాజిక బాధ్యతను సూచిస్తుందని మహేష్ బావ, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. మహేష్ బాబుతో పాటు గల్లా బుర్రిపాలెం వచ్చారు. ఆయన మాట్లాడారు. మహేష్ బాబును గుణగణాలు, చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చానన్నారు.
తనకు మహేష్ బాబు చిన్నప్పటి నుంచి తెలుసునని చెప్పారు. తన పెళ్లైనప్పటి నుంచి అటే పదిహేను, పదహారేళ్ల నుంచి తెలుసునని చెప్పారు. మహేష్ బాబుకు సామాజిక బాధ్యత ఎక్కువ అని, అందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు.
బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తాను తన భార్య పద్మ ద్వారా మహేష్ బాబుకు సూచించానని చెప్పారు. ఆ సమయంలోనే శ్రీమంతుడు చిత్రం వచ్చిందన్నారు. మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని భావించారని చెప్పారు.
బుర్రిపాలెంను మోడల్ విలేజ్గా చేస్తామని చెప్పారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నంతో స్మార్ట్ విలేజ్గా మారుతుందని చెప్పారు. మిగతా విషయాలు తర్వాత వచ్చి మాట్లాడుతానని చెప్పారు. బుర్రిపాలెం భవిష్యత్తులో ఆదర్శ గ్రామంగా మారుతుందన్నారు. రూ.2 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామన్నారు.
ఓ వక్త మాట్లాడుతూ... ఎవరికి ఆఫద వచ్చినా సూపర్ స్టార్ కృష్ణగారు అప్పుడు స్పందించేవారన్నారు. రాష్ట్రంలో తుఫానులు వస్తే సూపర్ స్టార్ కృష్ణ వెంటనే స్పందించేవారన్నారు. సినిమాల్లో కృష్ణ వారసుడిగా వచ్చిన మహేష్ బాబు సహాయం చేయడంలోనూ అదే వారసత్వాన్ని పుణికుపుచ్చుకున్నారని చెప్పారు.
మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఈ గ్రామానికి ఏమైనా చేయాలనే తపనతో దీనిని దత్తత తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మరొకరు మాట్లాడుతూ.. మహేష్ బాబు సినీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగారో, సామాజిక రంగంలోను అలాగే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. సూపర్ స్టార్ కుటుంబం ఎప్పుడు నక్షత్రంలా వెలగాలన్నారు.
'మహేష్ ఫ్యామిలీ హెల్త్ కార్డులు'
బుర్రిపాలెం గ్రామంలో ప్రతి ఇంటికి మహేష్ ఫ్యామిలీ హెల్త్ కార్డులను అందించారు. బుర్రిపాలెం గ్రామస్తులకు ఆంధ్రా హాస్పిటల్స్లో ఉచిత వైద్యం అందించనున్నారు. మహేష్ బాబు రావడంతో బుర్రిపాలెం జనసంద్రంగా మారింది.
అంతకుముందు, గ్రామానికి వచ్చిన మహేష్ బాబు వాహనం దిగి తన తండ్రి నివసించిన ఇంట్లోకి వెళ్లేందుకు 12 నిమిషాలు పట్టింది. డ్వాక్రా రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. డ్వాక్రా సంఘాలకు రూ.1కోటి చెక్కులు అందించారు. మహేష్ బాబు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు.