కోడి పందెంరాయుళ్లకు షాక్: హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, ఆదేశాలు
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో కోడి పందేలు జరగకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని ఆదేశించింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడిపందేలు నిర్వహించకుండా చూడాలని ఆదేశించింది.
కోడిపందేలను నిర్వహించకుండా చూడాలని గతంలో తాము జారీచేసిన ఉత్తర్వులను సరిగా అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంక్రాంతికి తమ ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైతే సీఎస్, డీజీపీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని కూడా హెచ్చరించింది.
మేమంటే గౌరవం లేదా..
కోడిపందేలు నిర్వహించి తీరుతామని ప్రజాప్రతినిధులు కొంత మంది బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని, వారికి కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేకుండా పోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడిపందేల వల్ల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, కోడిపందేలు ఓ వ్యాధిని అని, వాటిపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉండదని విమర్శించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ముసుగులో..
సుప్రీంకోర్టు ఆదేశాల ముసుగులో కోడి పందేలు నిర్వహిస్తున్నారని, పందేలు నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పలేదని అభిప్రాయపడింది. కోడిపందేలపై 2016 డిసెంబర్ 26న ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తప్పు పట్టింది.
వారిచ్చిన వివరాలపై అసంతృప్తి
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ విడివిడిగా సమర్పించిన వివరాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అదనపు వివరాలు సమర్పించడం కోసం విచారణను ఈనెల 4కు వాయిదా వేసింది. వివరాలు సమర్పించడంలో విఫలమైతే వారిరువురు స్వయంగా కోర్టుకు హాజరుకావలని ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఆ పిటిషన్పై..
సంక్రాంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ కె.రామచంద్రరాజు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా చట్ట నిబంధనలు ఉల్లంఘన కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది.