జగన్ ఛాంబర్ లీకేజీపై ప్రొఫెసర్లు అడిగిన ప్రశ్నకు.. అధికారులు నీళ్లు నమిలారట!
వాటర్ లీకేజీ అయిన ప్రాంతాన్ని, టెర్రస్ పైన పైపులను ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. అలాగే జగన్ కుర్చీపై సీలింగ్ ఎలా ఊడిపడిందని ప్రొఫెసర్లు ప్రశ్నించగా.. కాంట్రాక్టర్లు నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది.
గుంటూరు: ఏపీ అసెంబ్లీ భవనంలోని జగన్ ఛాంబర్లో వర్షపు నీరు లీకేజీ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుట్ర కోణం ఉందని టీడీపీ సభ్యులు ఆరోపిస్తుండగా.. ఇది జగన్పై జరిగిన కుట్ర అని అటు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జేన్టీయూ ప్రొఫెసర్ల బృందం ఒకటి జగన్ ఛాంబర్ ను సందర్శించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్లుగా తెలుస్తోంది.
జగన్ 'ఛాంబర్'కు చిల్లు: చిన్నపాటి వర్షానికే ఇంత అద్వాన్నమా?(ఫోటోలు)
జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు ఎలా లీకైందన్నది ప్రొఫెసర్లకు కూడా అంతుచిక్కలేదని తెలుస్తోంది. అదే సమయంలో సీఆర్డీయే కాంట్రాక్టర్లు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని చెబుతున్నారు. పైప్ లైన్ నుంచి జగన్ కుర్చీ వరకు నీళ్లు వెళ్లే అవకాశం లేదని ప్రొఫెసర్లు అంటున్నారు.
ఈ సందర్భంగా వాటర్ లీకేజీ అయిన ప్రాంతాన్ని, టెర్రస్ పైన పైపులను ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. అలాగే 'జగన్ కుర్చీపై సీలింగ్ ఎలా ఊడిపడిందని ప్రొఫెసర్లు ప్రశ్నించగా.. కాంట్రాక్టర్లు నీళ్లు నమిలినట్లుగా' తెలుస్తోంది. సివిల్ డిపార్ట్ మెంట్ పనులను పరిశీలించి.. ప్రొఫెసర్ల బృందం సీఐడీ అధికారులకు నివేదిక ఇవ్వనుంది.
ఇటు సీఐడీ అధికారులకు సైతం వాటర్ లీకేజీ అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ మొదటి ఫ్లోర్ లో సీసీ కెమెరాలు లేకపోవడంతో.. పైప్ కట్ చేసినవారిని ఎలా గుర్తించాలనే సందేహం వారికి కలుగుతోంది. విచారణ ప్రారంభించేసరికి మరమ్మత్తులు పూర్తి చేయడంతో దీనిపై ఎలా విచారణ జరపాలని అధికారులు తలపట్టుకున్నట్లుగా తెలుస్తోంది. లీకేజీ తర్వాత వెంటనే మరమ్మత్తులు చేయడం పట్ల సీఐడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.