జూపూడి ఔట్: జగన్పై టిడిపి దాడి, పార్థసారథి కౌంటర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడన్నారు. ఆయనకు బొత్తిగా రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేదన్నారు. అలాంటి వ్యక్తి రుణమాఫీపై వ్యాఖ్యానించడమేమిటన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమన్నారు.
బహిర్గతం: వర్ల

జూపూడి ప్రభాకర్ రావు రాజీనామాతో వైయస్ జగన్ దళితులకు గౌరవం ఇవ్వరన్న విషయం మరోసారి బహిర్గతమైందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా దన్నుగా నిలిచిన వారందరినీ జగన్ అవమానిస్తూ బయటకు పంపిస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో దళిత నేతలు, మైనార్టీలు, బీసీలు ఇకనైనా కళ్లు తెరవాలన్నారు.
పార్థసారథి ఎదురు దాడి
టీడీపీ నేతలు జగన్ను లక్ష్యంగా చేసుకోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పార్థసారథి విజయవాడలో మండిపడ్డారు. రుణమాఫీ చేయలేక జగన్పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీ అమల్లో పెట్టలేక ప్రతిపక్షంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆర్బీఐకి నివేదికలు పంపుతున్నారన్న ఆరోపణలను దేవినేని ఉమ నిరూపించగలరా? అని సవాల్ విసిరారు.
ఆర్బీఐపై నెపం మోపి రుణమాఫీ నుంచి తప్పుకోజూడడం తగదన్నారు. ఈ విషయంలో బీజేపీని ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. కేవలం జగన్ దిష్టిబొమ్మల దహనానికి 'చంద్రదండు' ఏర్పాటును తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రుణమాఫీ చేయమని జగన్ అడగటమే తప్పా అన్నారు.












Click it and Unblock the Notifications