కెసిఆర్కు ఒక్కడే!, పవన్ కళ్యాణ్ సహా.. బాబుకు వీరి బ్రేక్!!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెండేళ్ల పాలన పైన 'సెంటర్ ఫర్ మీడియా స్టడీస్' సంస్థ నిర్వహించిన సర్వేలో... కెసిఆర్ ప్రభుత్వం వేగంగా పరుగెడుతోందని, చంద్రబాబు ప్రభుత్వం కూడా దూసుకెళ్తున్నప్పటికీ అంతగా పరుగు తీయడం లేదని చెప్పింది.
ఆ విషయాన్ని పక్కన పెడితే ఇరువురు ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాలలో భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో కెసిఆర్కు ఎదురు లేకుండా పోతోంది. అదే సమయంలో ఏపీలో చంద్రబాబుకు రోజుకో చిక్కు అన్నట్లుగా వచ్చి పడుతోంది.
తెలంగాణలో విపక్షాలు ఉన్నప్పటికీ.. కెసిఆర్ దూసుకెళ్తున్నారు. ఆయనకు తిరుగు ఉండటం లేదు. పైగా విపక్ష ఎమ్మెల్యేలు వరుసగా కారు ఎక్కుతున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ వస్తేనే కెసిఆర్ను ధీటుగా ఎదుర్కోవచ్చుననే అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
కోదండరామ్, కెసిఆర్
అప్పుడప్పుడు కోదండరామ్ చేస్తున్న ప్రకటనలు కెసిఆర్కు వ్యతిరేకంగా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోదండ రాజకీయంగా విపక్షాలతో కలిసి వస్తే.. కెసిఆర్ను ఢీకొట్టడం తప్ప, అప్పటి దాకా తెలంగాణ ముఖ్యమంత్రికి ఎదురులేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి
అదే సమయంలో చంద్రబాబుకు ఏపీలో ఎన్నో చిక్కులు ఉన్నాయి. విభజన నాటికి తెలంగాణ సర్ ప్లస్లో ఉండగా, ఏపీ ఆర్థిక నష్టాల్లో ఉంది. ఏపీకి రాజధాని కావాలి. ఉద్యోగులు తరలి వెళ్లాలి. సచివాలయ, అసెంబ్లీ వంటి ఎన్నో నిర్మాణాలు కావాలి. ఇలా ఎన్నో చిక్కులు ఉన్నాయి.
వైయస్ జగన్
పాలనాపరమైన సమస్యలకు తోడు ఎప్పటికప్పుడు రాజకీయపరమైన సమస్యలు ఆయనకు వచ్చి పడుతున్నాయి. చంద్రబాబు వేసే ప్రతి అడుగు పైన జగన్ ప్రతి వ్యూహానికి సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పవన్ ప్రభావం తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పార్టీ పరంగా కూడా ఆయన ఏపీ పైనే ఎక్కువ దృష్టి సారించే అవకాశాలున్నాయి.
ముద్రగడ పద్మనాభం
చంద్రబాబుకు కాపు రిజర్వేషన్ల అంశం చిక్కులు తెచ్చి పెడుతోంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల పైన పదేపదే టిడిపి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఆర్ కృష్ణయ్య
కాపులను బీసీల్లో కలిపితే ఊరుకునేది లేదని తెలంగాణకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య చంద్రబాబును హెచ్చరిస్తున్నారు.
మందకృష్ణ మాదిగ
ఓ వైపు జగన్, మరోవైపు, ముద్రగడ, ఇంకోవైపు ఆర్ కృష్ణయ్య హెచ్చరికలు కనిపిస్తుండగానే మరోవైపు మందకృష్ణ మాదిగ ఏబీసీడీ వర్గీకరణ కోసం టిడిపి ప్రభుత్వంపై పోరాడుతున్నారు.
బైరెడ్డి రాజశేఖర రెడ్డి
రాయలసీమ పరిరక్షణ సమితి వేదిక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏకంగా ప్రత్యేక సీమ ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ఆయన మరో విభజన కోరుకుంటున్నారు.